తిరుమలలో డిసెంబర్ 17 నుంచి ధనుర్మాస తిరుప్పావై సేవ

By :  Kiran
Update: 2023-12-07 14:39 GMT

డిసెంబర్ 17 నుంచి ధనుర్మాసం ప్రారంభంకానుంది. ఈ క్రమంలో తిరుమలలో ధనుర్మాస ఉత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి తిరుప్పావైని నివేదిస్తారు. బ్రహ్మ ముహూర్తానికి గంటన్నర ముందుగా స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు.

తిరుప్పావై సందర్భంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తి ఏకాంతంగా జరుగుతుంది. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారని నమ్మకం. అందుకే ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు.

Tags:    

Similar News