శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఫిబ్రవరి నెల టికెట్ల కోటా రిలీజ్ ఎప్పుడంటే
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి స్పెషల్ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీని ప్రకటించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నవంబర్ 24 ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ చెప్పింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చిని సూచించింది.
శ్రీవారి సేవకు సంబంధించి ఫిబ్రవరి కోటా టికెట్లను నవంబర్ 27 టీటీడీ రిలీజ్ చేయనుంది. 2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించి శ్రీవారి సేవ స్లాట్లను నవంబరు 27న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్ చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. తిరుమల, తిరుపతిలో భక్తులు స్వచ్ఛందసేవ చేసేందుకు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను నవంబరు 27న మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు పరకామణి సేవ కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఈ సేవలను భక్తులు www.tirumala.org వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.