నగరం నడిబొడ్డున.. అమీర్పేట్ చౌరస్తాలో.. రేపే AAA మల్టీప్లెక్స్ ప్రారంభం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంటరయ్యారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున.. అమీర్ పేట్ జంక్షన్ లో ఏషియన్ అల్లు అర్జున్.. AAA సినిమాస్ పేరుతో నిర్మించిన మల్టీప్లెక్స్ బుధవారం ఓపెన్ కానుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అల్లు అర్జున్ దీన్ని ప్రారంభించనున్నారు.
ఆదిపురుష్తో ప్రారంభం
అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. దాదాపు రెండేళ్ల నుంచి కన్స్స్ట్రక్షన్లో ఈ మల్టీప్లెక్స్ తాజాగా పూర్తైంది. అల్లు అర్జున్ ఫోటోతోనే AAA లోగో కూడా విడుదల చేసారు. మల్టీప్లెక్స్ ప్రారంభమైన తర్వాతి రోజున ప్రభాస్ భారీ పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' విడదల కానుంది. 'AAA' సినిమాస్లో మొట్టమొదటి సినిమాగా ఆదిపురుష్ స్క్రీనింగ్ కానుంది. 2డీ, త్రీడీలో ప్రభాస్ సినిమాను ప్రదర్శించనున్నారు.
ఫుల్ ఎల్ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్
వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ కలిగించేలా బన్నీ మల్టీప్లెక్స్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. థియేటర్ లో ఫుల్ ఎల్ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సౌతిండియాలోనే ఫుల్ ఎల్ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్ సౌకర్యమున్న రెండో థియేటర్గా ఇది నిలువనుంది. స్టాండర్డ్ సినిమా ప్రొజెక్టర్స్కు బదులు ఇమేజ్ను ప్రొజెక్ట్ చేసేందుకు పూర్తిస్థాయిలో ఎల్ఈడీ స్క్రీన్ను వినియోగించనున్నారు. డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ తో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్తో సినిమా చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది. హైదరాబాద్లో ఇలాంటి సౌకర్యం కలిగిన మొదటి థియేటర్ ఇదే కావడం విశేషం.
కోట్ల ఖర్చుతో
అల్లు అర్జున్ గతేడాది అమీర్ పేటలోని సత్యం థియేటర్ కొనుగోలు చేశాడు. ఏషియన్ గ్రూప్తో కలిసి దాన్ని మల్టీప్లెక్స్ గా డెవలప్ చేశాడు. అత్యాధునిక టెక్నాలజీ, విశాలమైన లాంజ్, అద్భుతమైన సీటింగ్ వ్యవస్థ ఇలా ఎన్నో హంగులతో కూడిన ఈ మల్టీప్లెక్స్ నిర్మాణానికి బన్నీ కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని టాక్.