నార్కెట్ పల్లి వద్ద పుష్ప-2 ఆర్టిస్టుల బస్సుకు యాక్సిడెంట్

Update: 2023-05-31 03:39 GMT

హైదరాబాద్- విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి వద్ద అల్లు అర్జున్ సినిమా పుష్ప-2 సినిమా ఆర్టిస్టులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు , ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు ఆర్టిస్టులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాయపడిన సినిమా ఆర్టిస్టులు కావడంతో అక్కడే ఉన్న ప్రయాణికులు, స్థానికులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. బస్సులో ఇంకా ఆర్టిస్టులు ఎవరెవరున్నారో చూసే ప్రయత్నంలో అలజడి రేగింది. రోడ్డు మీద వాహానాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి

సినిమా షూటింగ్‌ ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమా షూటింగ్ కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం విడుదలైన పుష్ప సినిమాకు ఈ చిత్రం సీక్వెల్. రాత్రి సినిమా షూటింగ్ ముగించుకుని ఆర్టిస్టులు ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో నార్కట్‌పల్లి వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. స్థానికులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంతో పాటు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News