గెలుపు కష్టమే.. టీమిండియా అట్టర్ ఫ్లాఫ్

గెలవాలంటే అద్భుతం జరిగాలి

Update: 2023-06-09 01:10 GMT



ఇంగ్లాండ్​లోని ఓవల్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఆటతీరు క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.  ఈ కీలక పోరులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.ఈ మెగా మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఆసీస్ అనంతరం బౌలింగ్‌లోనూ మెరిసింది. ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో భారత బ్యాటర్లు కుదేలయ్యారు.  క్రీజులో అజింక్య రహానె ( 29*), కేఎస్ భరత్ (5) నాటౌట్‌గా ఉన్నారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (48; 51 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 


ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో భారత్‌ టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు రోహిత్ (15), శుభ్‌మన్ గిల్ (13) నిరాశపర్చగా.. టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా (14), విరాట్​ కోహ్లీ(14) కూడా విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, కమిన్స్‌, స్కాట్‌ బొలండ్‌, గ్రీన్‌, నాథన్‌ తలో వికెట్‌ తీశారు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో అజింక్యా రహానేతో కలిసి రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన జడేజాను నాథన్ లయన్ క్యాచ్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్‌తో మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడిన రహానే.. రెండో రోజు ఆటను ముగించాడు. టీమిండియా ఇంకా 318 పరుగుల వెనుకంజలో ఉంది.



ఈ పరుగులను టీమిండియా అధిగమించాలంటే మూడో రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి. ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఫస్ట్ సెషన్‌లోనే టీమిండియా ఆలౌటైతే.. మ్యాచ్ మూడున్నర రోజుల్లోనే ముగిసే అవకాశం ఉంది. అద్భుతం జరిగితే తప్పా టీమిండియా ఓటమి తప్పించుకోలేదు.





Tags:    

Similar News