మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం నగరంలోని శ్రీ నగర్ కాలనీలో జరిగిన ఈ ఆత్మహత్యకు ఘటనకి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి. బీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఎస్కార్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఏఆర్ఎస్ఐ ఫజాన్ అలీ ఈ ఉదయం డ్యూటీకి తన వెంట కూతురిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కూతురి ముందే.. తన గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనగనర్ కాలనీలో మణికంఠ హోటల్ లో ఈ ఘోరం జరిగింది. ఆత్మహత్యకు లోన్ రికవరీ వేధింపులే కారణమని తెలుస్తోంది. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక ఇలా సూసైడ్ చేసుకొని ఉండొచ్చని అక్కడి వారు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి సబిత పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.