రాష్ట్ర శ్రేయస్సు కోరుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోమం

రాష్ట్ర శ్రేయస్సు కోరుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోమం

Update: 2023-06-12 08:01 GMT



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోమం నిర్వహించారు. సోమవారం ఉదయం 6:55 గంటలకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధారణలో పవన్ యాగశాలకు వచ్చి.. దీక్ష చేపట్టారు. ఇందుకు సంబంధించి.. జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా విశ్వసించే పవన్.. ఈ క్రమంలోనే ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ.. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తాను తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు.


యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి.. శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అఫ్లైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత, త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదుగురు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా సోమవారం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా.. మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా.. కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్దంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోంది. ఇదే సమయంలో.. కార్యాలయ ప్రాంగణంలో భవన నిర్మాణం కోసం పవన్ భూమి పూజ నిర్వహించారు.




Tags:    

Similar News