కొడంగల్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

త్వరలోనే రైతు, విద్యా కమిషన్ల ఏర్పాటు

By :  Kiran
Update: 2024-03-01 13:44 GMT


పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పౌరసంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తామని వారితో అన్నారు. పంట మార్పిడి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కౌలు రైతుల రక్షణకు చట్టం రూపొందించాలనే యోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు. కౌలు రైతుల రక్షణ కు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు , సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామన్నారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయమని, రైతుభరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామన్నారు.

ఇక విద్యా కమిషన్ ఏర్పాటుపై మాట్లాడుతూ.. విద్యావిధానం ఎలా ఉండాలో కమిషన్‌ నిర్ణయిస్తుందని తెలిపారు. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కుల, మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశామని, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధర్నా చౌక్ ను తెరిచామని, ప్రజా భవన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజా పాలన పాలన ద్వారా సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. దీంతో నిస్సహాయులకు, నిజమైన లబ్దిదారులకు అవసరమైతే చెప్పినదానికంటే ఎక్కువ సహాయం చేయొచ్చని చెప్పారు. ఆర్ధిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీటి రంగం పరిస్థితి పై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు.



Tags:    

Similar News