Women's Cricket : మహిళా క్రికెట్ మరో ముందడుగు.. బీసీసీఐ పెద్ద ప్లాన్

Byline :  Bharath
Update: 2024-01-14 14:39 GMT

మహిళల క్రికెట్ విషయంలో బీసీసీఐ మరో ముందడుగు వేసింది. రంజీ ట్రోఫీ తరహా దేశవాళీ టోర్నీని మహిళల క్రికెట్ లో తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. క్రికెట్ లో అభివృద్ధి చెందుతున్న టీమిండియా.. అగ్రశ్రేణి జట్లను కూడా మట్టికరిపిస్తుంది. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజేతగా నిలిచింది. దీంతో మహిళా క్రికెటర్లంతా తమకూ పురుషుల క్రికెట్ తరహా.. దేశవాళిలో రెడ్ బాల్ క్రికెట్ ను తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలువురు క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు కూడా మహిళల క్రికెట్ లో రంజీల మాదిరిగా రెడ్ బాల్ క్రికెట్ ను తీసుకురావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జోనల్‌ ఫార్మాట్‌లో సాగబోయే ఈ మ్యాచ్‌లు మార్చి- ఏప్రిల్‌ నెలల్లో నిర్వహించనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

త్వరలో డబ్ల్యూపీఎల్ మొదలవనుంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే రెడ్ బాల్ క్రికెట్ ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. పురుషుల దులీప్ ట్రీఫీ విధానం లాగ.. ఈ మ్యాచులు కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. కాగా మహిళలకు దేశవాళీ క్రికెట్ ఇదివరకు నిర్వహించారు. 2014-15 నుంచి 2017-18 మధ్య ఇలాంటి మ్యాచ్ లను నిర్వహించారు. అయితే కొన్ని కారణాల వల్ల వీటికి బ్రేక్ పడింది. కానీ గడిచిన మూడేళ్లలో మహిళల క్రికెట్ కూడా ఊపందుకుంది. దేశంలోని చిన్న నగరాల నుంచి వందలాది మంది యువ క్రికెటర్లు క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ దేశవాళీలో రెడ్ బాల్ క్రికెట్ ను తీసుకొస్తుంది.





Tags:    

Similar News