Joginder Sharma : టీమిండియాకు వరల్డ్కప్ అందించిన క్రికెటర్పై పోలీస్ కేసు

Byline :  Bharath
Update: 2024-01-06 01:34 GMT

జోగిందర్ శర్మ.. భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 2007 సౌతాఫ్రికా గడ్డపై జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్లు కీలక పాత్ర పోషించినా.. జోగిందర్ శర్మను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ దశలో అద్భుతంగా బౌలింగ్ చేసిన జోగిందర్ జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా ప్రస్తుతం హర్యానా డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జోగిందర్.. చిక్కుల్లో పడ్డాడు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో అతనిపై కేసు నమోదైంది.




 


హిస్సార్ నివాసిని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు హర్యానా పోలీసులు జోగిందర్ శర్మతో పాటు.. మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. జనవరి 1న హిస్సార్ లో నివాసం ఉంటున్న పవన్ ఆస్తి తగాదాలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత రోజు అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉందని, ఈ విషయంలో జోగిందర్ సహా మరో ఐదుగురు తన కొడుకును వేధించారని కేసులో తెలిపింది. అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించారని పోలీసులకు చెప్పింది. వారిని అరెస్ట్ చేయాలని మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద అతని కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. కాగా పోలీసులు విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.






Tags: