భారత్ ఓపెనర్ తుఫాన్ ఇన్నింగ్స్...డబుల్ సెంచరీతో సమాధానం

Update: 2023-08-09 16:33 GMT

తన టాలెంట్ తో భారత్ జట్టులోకి రాకెట్ స్పీడ్ లో వచ్చిన పృథ్వీ షా అంతే వేగంతో చోటు కోల్పోయాడు. వరుస వైఫల్యాలు, వివాదాలు అతడిని వెంటాడాయి. ఐపీఎల్ -2023లో రాణించి జట్టులోకి రావాలన్న అతడి ఆశ నెరవేరలేదు. శుభమన్ గిల్, జైశ్వాల్ వంటి ప్లేయర్స్ అదరగొడుతుండడంతో పృథ్వీ షా పని అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ యువ ఆటగాడు మాత్రం రీ ఎంట్రో కోసం అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు.

తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు ఈ ఏడాది నుంచి కౌంటీల్లో ఆడుతున్న పృథ్వీ షా...ఇంగ్లండ్ గడ్డపై తన సత్తా చాటాడు. డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. నార్తాంప్టన్ షైర్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. బుధవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 129 బంతుల్లో 24 ఫోర్లు, 8 సిక్స్‌లతో ద్విశతకం అందుకున్నాడు. మొత్తం 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్‌లో 39 బౌండరీలు ఉండటం విశేషం.

టోర్నీలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా షా తన పేరును రికార్డు పుస్తకాల్లోకి ఎక్కించాడు. అదే విధంగా వన్డే కప్‌లో ఓలీ రాబిన్సన్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోర్ 206 పరుగులను పృథ్వీ షా అధిగమించాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. పురుషుల లిస్ట్ క్రికెట్‌లో అత్యధిక బౌండరీలు బాదిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.

రాబోయే మ్యాచ్ ల్లో కూడా ఇదే ఫామ్ ను కొనసాగిస్తే భారత్ జట్టులో పృథ్వీ షాకు డోర్లు తెరిచి ఉండే అవకాశం ఉంది.


Tags:    

Similar News