పాక్‎కు చుక్కలు చూపించిన భారత్ కుర్రోళ్ళు

Update: 2023-07-19 15:52 GMT

ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ కప్‌లో భారత్-ఏ మరో విజయం నమోదు చేసింది. కొలంబో వేదికగా జరిగిన వన్డేలో దాయాది పాకిస్థాన్‌‌-ఏపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్‌ (104, 110 బంతుల్లో) శతకంతో విజృంభించాడు. నికిన్‌ జోస్‌ (53) అర్థసెంచరీతో రాణించాడు. యశ్‌ ధుల్‌ 21, అభిషేక్‌ శర్మ 20 పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 48 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఖాసిమ్‌ అక్రమ్‌ (48), షాహిబ్‌జాదా ఫర్హాన్‌ (35), హషీబుల్లా ఖాన్‌ (27), ముబసిరర్‌ ఖాన్‌ (28), మెహ్రన్‌ ముంతాజ్‌ (25) రాణించారు. భారత బౌలర్లలో రాజవర్ధన్‌ హంగర్గేకర్‌ ఐదు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. మానవ్‌ సుతార్‌ మూడు వికెట్లతో చెలరేగగా..రియాన్‌ పరాగ్‌, నిషాంత్‌ సింధులకు ఒక్కో వికెట్ దక్కింది. ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్‌ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్‌లపై భారీ విజయాలు నమోదు చేసింది.

Tags:    

Similar News