ఆసీస్ వీరులను చిత్తుగా ఓడించిన కుర్రాళ్లు

Byline :  Bharath
Update: 2023-12-02 01:48 GMT

ఒక్క సీనియర్ ఆటగాడు లేడు.. ఎక్స్ పీరియన్స్ ఉన్న కెప్టెనూ కాదు. కానీ.. ప్రతీ ఆటగాడిలో కసి. గెలవాలన్న తపన. వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడినందుకు ప్రతీకారం.. అన్నీ కలిపి ఆస్ట్రేలియాను చిత్తు చేశారు. ఐదు మ్యాచ్ లో టీ20 సిరీస్ లో ఆతిథ్య టీమిండియా.. ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. రింకూ సింగ్, జితేశ్ శర్మ మెరుపులకు.. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ స్పిన్ మంత్రం తోడవడంతో 20 పరుగుల తేడాతో ఆసీస్ ఓడిపోయింది. రాయపూర్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో.. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 174 రన్స్ చేసింది. రింకూ సింగ్ 46, జైశ్వాల్ 37,రుతురాజ్ గైక్వాడ్ 32, జితేష్ శర్మ 35 పరుగులతో రాణించారు. మిగితా బ్యాట్స్మెన్స్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ద్వార్షుయిస్ 3 వికెట్లు పడగొట్టగా.. తన్వీర్ సంఘా 2, బెహ్రెన్‌డార్ఫ్ 2, ఆరోన్ హార్డీ ఒక వికెట్ తీశారు.

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. బ్యాటర్లు తడబడ్డారు. కెప్టెన్ మ్యాథ్యూ వేడ్ 36, ఓపెనర్ ట్రావిస్ హెడ్ 31 మినహా ఏ ఒక్కరు కూడా క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. టీమిండియా స్పిన్ ముందు బోల్తా పడ్డారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లతో తిప్పేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీసి పరుగులు కట్టడి చేశారు. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు. అవేశ్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది.

ఈ సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక మూడో టీ20లో గెలిచిన ఆసీస్ ఈ మ్యాచ్ లో గెలిచి సీరీస్ సమం చేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు.

Tags:    

Similar News