గంట చార్జ్‌తో 120 కి.మీ.ల ప్రయాణం..మార్కెట్‎లో సరికొత్త ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌..

Update: 2023-05-31 04:45 GMT

పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో మార్కెట్‎లో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఇవి ఎకో ఫ్రెండ్లీ కూడా కావడంతో ప్రజలు కూడా విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు మార్కెట్‎లోకి ఆకర్షణీయమైన ఫీచర్లతో వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా జెన్ మొబిలిటీ సంస్థ జెన్ మైక్రో పాడ్ పేరుతో విద్యుత్‎తో నడిచే మూడు చక్రాల బండిని లాంచ్ చేసింది. గురుగ్రామ్‎కు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ థార్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి ఈ వాహనాన్ని రూపొందించింది.

ఈ త్రీ వీలర్లను రెంటుకు, లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల అవసరాలను బట్టి వాహనాన్ని నెలకు రూ.9,999 అద్దెపై అందించనుంది సంస్థ.

జెన్ మైక్రో పాడ్ ప్రత్యేకమైన కార్గో బాక్స్‌ని కలిగి ఉంటుంది. ఇది వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. ఈ మైక్రో పాడ్‎లో షెల్ఫ్‌లు, రిఫ్రిజిరేటెడ్ బాక్స్‌లు, ఓపెన్ టబ్‌లు ఉంటాయి. ఈ యూనిట్లో దొంగతనం జరుగకుండా ఉండేందుకు సురక్షితమైన లాకింగ్ మెకానిజాన్ని అమర్చారు. అదనంగా, పాడ్ యొక్క పేటెంట్ పొందిన వారికి వాహన ట్రాకింగ్, స్టేట్ ఆఫ్ ఛార్జ్ మానిటరింగ్, జియోఫెన్సింగ్ , రిమోట్ లాకింగ్‌ వంటి సదుపాయాలను అందిస్తున్నాయి. జెన్ మైక్రో పాడ్ తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తుంది. బైక్‌లతో చేసే డెలివరీ పద్ధతులతో పోల్చితే ఈ త్రీ వీలర్ తక్కువ ధరకే డెలివరీ చేస్తుంది. లాజిస్టిక్స్ కంపెనీలకు, వారి ఆపరేటర్లకు ఈ వాహనం ఒక ఆకర్షణీయమైన ఎంపిక. జెన్ మైక్రో పాడ్‌ని ఎంచుకోవడం ద్వారా, లాజిస్టిక్స్ కంపెనీలు మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవచ్చని వాహన తయారీదారులు చెబుతున్నారు.

ఆర్‌5ఎక్స్‌, ఆర్‌10ఎక్స్‌ అనే రెండు వేరియంట్లలో వాహనాన్ని పొందవచ్చు. ఒక్కో వాహనం సుమారు 150 కిలోల వరుకు బరువును మోస్తుంది. ఒకటిన్నర నుంచి రెండు గంటల వ్యవధిలోనే చార్జింగ్ పూర్తవుతుంది. ఈ త్రీ వీలర్ ను చార్జ్ చేయడానికి నాలుగు యూనిట్ల కరెంటు మాత్రమే సరిపోతుంది. సింగిల్‌ చార్జ్‌తో ఎంతలేదన్నా 120 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు.


Tags:    

Similar News