Trump : ట్రంప్‌కు వరుస షాక్లు.. మోసం చేసిన కేసులో రూ. 3వేల కోట్లు పెనాల్టి

Byline :  Vinitha
Update: 2024-02-17 06:33 GMT

అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)కు వరుస షాక్ లు తగులుతున్నాయి. అగ్ర రాజ్యం అధికార పీఠాన్ని రెండోసారి దక్కించుకోవాలని కలల కంటున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు..తాజాగా న్యూయార్క్‌ కోర్టు మరో షాకిచ్చింది. పలు బ్యాంకులను మోసం చేసిన కేసులో 364 మిలియన్‌ డాలర్లు (రూ.3వేల కోట్లకు పైగా) ఫైన్ వేసింది.

ట్రంప్ తన ఆస్తులను ఉన్నదాని కంటే ఎక్కువగా చూపించి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువడ్డాయి. చాలా కాలం పాటు ఇలా మోసపూరితంగా బిజినెస్ లోన్స్, బీమా పొందారన్న అభియోగాలపై కేసు నమోదైంది. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌, డెమోక్రాట్‌ నేత లెటిటియా జేమ్స్‌ ఈ పిటిషన్ వేయగా.. దీనిపై న్యాయస్థానం రెండున్నర నెలల పాటు విచారణ జరిపింది.

విచారణలో ట్రంప్ పై అభియోగాలు రుజువవ్వడంతో 365 మిలియన్‌ డాలర్ల జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేగాక, మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన ఆఫీసర్‌, డైరెక్టర్‌గా ఉండకూడదంటూ నిషేధం విధించింది. ఇది సివిల్‌ కేసు కావడంతో జైలు శిక్ష వేయట్లేదని జడ్జి చెప్పారు. ఈ తీర్పుపై తాము అప్పీల్‌కు వెళ్తామని ట్రంప్‌ తరఫు లాయర్లు చెప్పారు.

ఇప్పటికే మరోసారి అధికారం దక్కించుకునేందుకు ఎన్నికలపై దృష్టి పెట్టిన ట్రంప్ కు.. గత కొంతకాలంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో ఆయనపై నేరాభియోగాలు ఫైల్ అయ్యాయి. ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించిన పరువునష్టం కేసులో అమెరికన్‌ జర్నలిస్ట్ జీన్‌ కరోల్‌ కు 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692.4 కోట్లు) చెల్లించాలని మాన్‌హటన్‌ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఇక, 2022లో ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన మోసం కేసులో ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు 1.6 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించారు.




Tags:    

Similar News