కేదార్‎నాథ్ విపత్తును తలిపిస్తున్న అలస్కా..ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

By :  Lenin
Update: 2023-08-09 05:40 GMT

అలస్కా రాజధాని నగరం జునౌను వరదలు ముంచెత్తాయి. హిమానీనదం పగిలిపోవడంతో నగరం అల్లకల్లోలంగా మారింది. ఈ విస్ఫోటనం కారణంగా భారీగా వస్తున్న వరద నీరు ప్రజలకు వణుకుపుట్టిస్తోంది. ఎత్తైన భవనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. చాలా మంది ప్రజల ఆచూకీ లభించడం లేదు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీని ప్రకటించారు. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలస్కాలో జరిగిన ఈ ప్రకృతి విపత్తు 2013లో భారత్‎లో చోటు చేసుకున్న అత్యంత భయంకరమైన కేదార్‎నాథ్ విపత్తును తలపించేలా ఉందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలోని అలస్కాలో మెండెన్‎హాల్ నది ప్రవహిస్తుంటుంది. ఇదే పేరుతో జనెపు నగరానికి సమీపంలో ఉన్న కొండల నడుమ హిమానీనదం ఉంది. ఈ హిమానీనదం కారణంగా స్థానికంగా ఓ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు గుండా మెండెన్‎హాల్ నది ప్రవహిస్తుంటుంది. సరస్సుకు సహజ సిద్ధంగా ఏర్పడిన ఆనకట్టు తెగిపోవడంతో నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఫలితంగా ఉపద్రవం ముంచుకొచ్చింది. ఈ వరదల కారణంగా పలు రోడ్లు నీట మునిగాయి. భారీ భవనాలు కుప్పకూలాయి. అక్కడి ప్రజలు చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొంత మంది వరదల్లో కొట్టుకుపోయారు. నదీ తీరప్రాంతమంతా కోతకు గురికావడంతో ప్రమాదం అంచున అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించామని జనెవు నగర డిప్యూటీ సిటీ మేనేజర్‌ రాబ్‌ బర్న్‌ తెలిపారు. అక్కడి రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ హిమానీనదం గురించి చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. హిమానీనదం పగిలిపోయే అవకాశాలు ఒక శాతం మాత్రమే ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే హఠాత్తుగా వరదల రూపంలో విపత్తు సంభవించడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. అయితే ఇంతటి అల్లకల్లోలానికి గ్లోబల్‌ వార్మింగ్‌ కారణమా అన్నఅనుమాణాలు వ్యక్తం చేస్తున్నారు. 








Tags:    

Similar News