లిబియాలో మహావిషాదం.. 2వేల మంది మృతి.. 10వేల మంది మిస్సింగ్..

By :  Krishna
Update: 2023-09-12 15:30 GMT

శిథిలమైన బిల్డింగులు, చెదిరిపోయిన బతుకులు, కొట్టుకపోయిన వాహనాలు..ఇది లిబియాలోని డెర్నా నగరం పరిస్థితి. డేనియల్ తుఫాన్తో డెర్నా చిగురుటాకుల వణికిపోయింది. భారీ వర్షాలు, వరదలు నగరంలో విధ్వంసం సృష్టించాయి. వరదలతో 2వేల మంది మృతి చెందగా.. సుమారు 10వేల మంది గల్లంతయ్యారు.

ఒక పక్క సాయుధ దళాల తిరుగుబాటుతో అట్టుడుకుతున్న లిబియాను డేనియల్ తుఫాన్‌ మరింత ఆగం చేసింది. తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో డానియెల్ తుఫాను ప్రభావంతో కుండపోతగా వాన కురిసింది. భారీ వర్షానికి నగరం సమీపంలో ఉన్న రెండు డ్యామ్‌లు తెగిపోవడంతో వరద ముంచెత్తింది. దీంతో వేల మంది జనం కొట్టుకపోయారు. నది పరిసరాల్లో ఉన్న ఇళ్లు, భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఎన్నో అపార్ట్‌మెంట్‌లు బురదలో కూరుకుపోయాయి.

తుఫాన్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే ఇంత భారీ ముప్పు తలెత్తిందని లిబియా ఎమర్జెన్సీ అండ్‌ అంబులెన్స్‌ అథారిటీ చీఫ్‌ ఒసామా అల్యా తెలిపారు. సముద్ర మట్టం, వరద, గాలివేగం, వంటివి సరిగ్గా అధ్యయనం చేయలేకపోయామన్నారు. ఈ స్థాయి ముప్పును గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదన్నారు. తూర్పు తీరంలోని మరిన్ని నగరాలు కూడా ఆకస్మిక వరదలకు వణికిపోయినట్లు చెప్పారు.

సైనిక దళాలు, వాలంటీర్లు, స్థానిక ప్రజలంతా కలిసి శిథిలాల తొలగింపు, శవాలను వెలికితీయడంలో నిమగ్నమయ్యారు. లిబియాలో వచ్చిన ప్రకృతి విపత్తుతో వివిధ దేశాలు స్పందించాయి. ఈజిప్టు, అల్జీరియా, టర్కీ , యూఏఈ సహా పలు దేశాలు లిబియాకు సహాయక బృందాలను తరలించాయి. అటు ఐక్యరాజ్యసమితి కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంది.







Tags:    

Similar News