తాగిన మత్తులో బార్‌కు నిప్పు.. 11 మంది మృతి

Update: 2023-07-23 10:20 GMT

మద్యం మత్తు ఎంత పనైనా చేయిస్తుంది. మత్తులో కొంత మంది క్రూరంగా ప్రవర్తిస్తారు. అలా ఓ యువకుడు చేసిన పని పెను విషాదాన్ని మిగిల్చింది. అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించొద్దు అన్న కారణంగా ఏకంగా బార్ షాపుకే నిప్పటించాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

పూర్తివివరాలు చూస్తే.. మెక్సికోలోని సోనోరా రాష్ట్రంలోని శాన్‌ లూయిస్‌ రియో కొలరాడో నగరంలో బార్‌కు వెళ్లిన యువకుడు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో అతడిని సిబ్బంది బయటకు పంపివేశారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీకి, ఆ యువకుడి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికే అక్కడికి వచ్చిన యువకుడు బార్ షాపుకు నిప్పంటించాడు.

బార్‌పై పెట్రోల్‌ బాంబు ద్వారా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బార్ షాపు మొత్తం కర్రతో చేసినది కావడంతో మంటలు దావానంలా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 11మంది మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు నగర మేయర్ శాంటోస్ గొంజాలెజ్ తెలిపారు.ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News