Cyber kidnapping : సైబర్ కిడ్నాపింగ్ అంటే ఏంటో తెలుసా?

Update: 2024-01-03 11:05 GMT

కిడ్నాప్ అంటే సాధారణంగా అందరికీ తెలిసింది ఏంటంటే.. ఓ వ్యక్తిని బలవంతంగా ఎత్తుకెళ్లి రహస్య ప్రదేశంలో ఉంచుతారు. తర్వాత ఆ వ్యక్తి తల్లిదండ్రులకు గానీ దగ్గరివాళ్లకు గానీ ఫోన్ చేసి డబ్బు అడగడమో లేక వేరే ఏదైనా డిమాండ్ ఉంటే దాని కోసం అడుగుతుంటారు. ఒకవేళ కిడ్నాపర్ల డిమాండ్లను తీర్చకుంటే కిడ్నాప్ కు గురైన వాళ్లను చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక సైబర్ కిడ్నాపింగ్ విషయానికి వస్తే దీని ఉద్దేశం కూడా వ్యక్తుల నుంచి డబ్బు లాగడమో లేక ఇంకేదైనా డిమాండ్ ఉంటే సాధించుకోవడమో చేస్తుంటారు. కానీ కిడ్నాప్ విధానం పూర్తిగా వేరే ఉంటుంది. సైబర్ కిడ్నాపర్లు వ్యక్తుల కంప్యూటర్ల నుంచి గానీ స్మార్ట్ ఫోన్ల నుంచి గానీ విలువైన సమాచారాన్ని దొంగిలిస్తారు (అవి బ్యాంకుకు సంబంధించిన విషయాలు కావొచ్చు లేక పర్సనల్ విషయాలు కావొచ్చు). అదేవిధంగా కంప్యూటర్లను హ్యాక్ చేసి వాటిని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు. కంప్యూటర్ల పాస్ వర్డ్స్ అన్నింటిని మార్చేస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి వీడియో కాల్ చేసి తాము చెప్పినట్లు చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను గానీ దగ్గరివాళ్లను గానీ చంపేస్తామంటూ బెదిరిస్తారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని వీడియో కాలింగ్ ద్వారా ఇంటి నుంచి బయటకు వచ్చేలా డైరెక్ట్ చేస్తారు. తాము చెప్పిన చోటుకు వెళ్లాలంటూ ఫోన్ లో బెదిరిస్తుంటారు. ఆ వ్యక్తి ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లాక ఆ ఫోటోలు బాధిత వ్యక్తి తల్లిదండ్రులకు గానీ దగ్గరివాళ్లకు గానీ పంపించి డబ్బు కోసం బెదిరిస్తుంటారు. వాళ్లకు డబ్బు ముట్టాక వదిలేస్తారు. లేకుంటే వాళ్లను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపిస్తుంటారు.

ఇక ఇలాంటి కిడ్నాపింగ్ ఇటీవల అమెరికాలో వెలుగు చూసింది. అమెరికాలో చదువుకుంటున్న చైనాకు చెందిన కై జువాంగ్ కు కొందరు సైబర్ కిడ్నాపర్లు ఆన్ లైన్ లో పరిచయం అయి అతడి ల్యాప్ టాప్ లోని డేటాను మొత్తం కొట్టేశారు. అందులో చాలా పర్సనల్ డేటా కూడా ఉంది. అనంతరం తాము చెప్పినట్లు చేయాలిని లేకుంటే డేటాను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో అతడు వీడియో కాలింగ్ లో చెప్పినట్లుగా చేస్తూ బ్రిగ్ హామ్ సిటీకి 25 మైళ్ల దూరంలో ఉన్న ఓ టెంట్ లోకి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అతడిని తాము చెప్పేవరకు అక్కడే ఉండాలని వాళ్లు వార్నింగ్ ఇచ్చారు. ఇక మరోవైపు జువాంగ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కొడుకును కిడ్నాప్ చేశామని, డబ్బులివ్వకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. వాళ్లు నమ్మడానికి టెంట్ లో ఉన్న జువాంగ్ ఫోటోలు పంపించారు. దీంతో భయపడ్డ తల్లిదండ్రులు కిడ్నాపర్లు అడిగిన 80 వేల డాలర్ల (రూ.66 లక్షలు)ను వాళ్లకు ఆన్ లైన్ పేమెంట్ చేశారు. అయితే అంతకుముందే తల్లిదండ్రులు తమ కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఫోటోలతో సహా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కిడ్నాపర్లు పంపిన ఫోటోలు, సెల్ ఫోన్ డేటా, బాధితుడి వాట్సాప్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగా పోలీసులు బాధితుడి అడ్రెస్ ను కనుగొన్నారు. అక్కడి వెళ్లి తీవ్ర చలితో గజగజ వణుకుతున్న జువాంగ్ ను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఉదంతం డిసెంబర్ 3న వెలుగులోకి వచ్చింది.

సైబర్ కిడ్నాపింగ్ కు గురికాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

యునైటెడ్ స్టేట్స్ సైబర్‌సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆన్‌లైన్ భద్రతకు సంబంధించి పలు సూచనలు చేసింది.

1. ఫోన్ లో గానీ కంప్యూటర్ లో గానీ వీలైనన్నీ సెక్యూరిటీ యాప్స్ ను పెట్టుకోవాలి. కేవలం పాస్ వర్డ్ ల మీదనే ఆధారపడొద్దు.

2. తరచుగా కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేస్తూ ఉండాలి.

3. ఈ మెయిల్ కు ఏవైనా పాప్ అప్ యాడ్స్ వచ్చినప్పుడు వాటిపై క్లిక్ చేసే ముందు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.

4. స్ట్రాంగ్ పాస్ వర్డ్ లను వాడాలి

Tags:    

Similar News