ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం(ATF)ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Update: 2023-06-05 04:18 GMT


సిడ్నీ: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం(ATF)ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక హార్వే లోవే పెవిలియన్ - కాజిల్ హిల్సెలో కల్చరల్ నైట్ రూపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపుగా 800 వందల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక పారామాటా- మేయర్ సమీర్ పాండే (Sameer Pandey), బ్లాక్ టౌన్ కౌన్సిలర్ లివింగ్ స్టన్ చిటిపల్లి (Livingston Chettipally), తెలంగాణ గవర్నర్ సెక్రటరీ - సురేంద్ర మోహన్ (Surendra Mohan) హాజరయ్యారు.

ఏటీఎఫ్ కోశాధికారి వినయ్ కుమార్ యమ (Vinay Kumar Yama) మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలూ కృషి చేసిన ఏటీఫ్ కార్యవర్గ సభ్యులను కొనియాడారు. తరువాత తెలంగాణ అమరులకు, ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి అర్పించి తెలంగాణ ఆట,పాటలతో కార్యక్రామాన్ని హుషారెత్తించారు. వేడుకలు జరుగుతున్న ప్రాంతమంతా 'జై తెలంగాణ' నినాదాలతో మారుమోగిపోయింది. పిల్లలు, పెద్దలు తమ ఆట పాటలతో అతిథులను ఉర్రూతలూగించారు. ఇక్కడ నివసిస్తున్న తెలంగాణ వాదులలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తాజాగా కలిగించే లక్ష్యంతో ఈ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. స్థానిక చిన్నారుల చేసిన తెలంగాణా జానపద గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి, అతిథులను విశేషంగా అలరించాయి.




 


సిడ్నీ బతుకమ్మ &దసరా ఫెస్టివల్ఇన్‌కార్పొరేటెడ్ అసోసియేషన్(SBDF)ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ పోస్టర్‌ను సురేంద్ర మోహన్ (Surendhra Mohan IAS) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ కడపర్తి (Prashanth Kumar Kadaparthi).. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులను, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రను గుర్తు చేశారు. స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని, బంగారు తెలంగాణ నిర్మాణంలో మనమందరం బాధ్యత వహించాలని కోరారు. ఏటీఎఫ్ ఆశయాలను సభకు వివరించారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాల్సిన ఆవశ్యకతను ఉందన్నారు.




 


ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి ముద్దం (Goverdhan Reddy Muddam)అందరూ ఒక్కచోటకూడి ఇలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు వాణి ఏలేటి, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి ముద్దం, కోశాధికారి వినయ్ కుమార్ యమ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News