భర్తకు విడాకులిప్పించాడు.. ఇంకో పెళ్లి సిద్ధమయ్యాడు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-29 05:17 GMT

భర్త ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లగా.. తోడు కోసం కారు డ్రైవర్‌కు దగ్గరైంది ఓ వివాహిత. అతనితో సన్నిహితంగా మెలిగింది. ఈ క్రమంలోనే భర్తకు విడాకులిస్తే.. పెళ్లి చేసుకుంటానన్న అతగాడి మాటలు నమ్మింది. కొన్నాళ్ల తర్వాత తనను కాదని మరో మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి పోలీసులను ఆశ్రయించింది. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా.. ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. కానూరు మురళీనగర్‌ కు చెందిన శ్రవణం గాయత్రికి 2001లో గన్నవరానికి చెందిన వాసుదేవశర్మతో వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత అతడు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లగా.. గాయత్రి పుట్టింట్లోనే ఉండిపోయింది. ఈ క్రమంలోనే ఆమెకు కొన్నేళ్ల కిందట ముదినేపల్లి మండలం పెదగొన్నూరుకు చెందిన శ్రవణం లక్ష్మయ్య, కనకదుర్గ దంపతులతో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా వీరి కుమారుడు ఫణిరంజిత్‌ పరిచయమవగా అది ప్రేమగా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ సన్నితంగా ఉంటున్నారు.

కారు డ్రైవర్‌గా పని చేస్తున్న ఫణిరంజిత్‌.. వాసుదేవశర్మతో విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానంటూ గాయత్రిని నమ్మించాడు. అతడి తల్లిదండ్రులు కూడా అదే చెప్పడంతో చివరకు భర్త వాసుదేవశర్మ నుంచి 2022లో విడాకులు పొందింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్‌లో ఫణిరంజిత్‌ను పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. కొన్నాళ్ల నుంచి ఇతడు విపరీతంగా మద్యం తాగి వచ్చి భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. ఆమె ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. మూడు నెలల నుంచి ఇతను ఇంటి ముఖం చూడకుండా ఉండటంతో పాటు అధిక కట్నం తెచ్చే మరో మహిళను పెళ్లి చేసుకుంటానంటూ తేల్చి చెప్పాడు. దీంతో గాయత్రి అత్తమామలకు చెప్పగా.. తన కొడుకు రెండో పెళ్లికి అడ్డుపడొద్దని వార్నింగ్ ఇచ్చారు. అడ్డుపడితే చంపేస్తామని బెదిరించారు. చివరకు రెండో భర్తపై, అతని తల్లిదండ్రులపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది గాయత్రి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News