అన్నవరంలో కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే జరిమానా...

Update: 2023-08-14 03:42 GMT

అన్నవరం పుణ్యక్షేత్రం.. ప్రతిరోజు కొన్నివేల మంది వెళ్తారు. సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వ్రతాలు జరిపిస్తారు. ఈ ఆలయంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మంగళవారం నుంచి కొండపై ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు ఈవో ఆజాద్ తెలిపారు. గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసిన బాటిల్స్ లోనే నీళ్లు తాగాలని సూచించారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

గాజు సీసాలో నీటిని కూలింగ్‌ ఛార్జీతో కలిపి రూ. 60కి విక్రయిస్తారని ఈవో చెప్పారు. ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇస్తే రూ. 40 వెనక్కి ఇస్తారన్నారు. మొక్కజొన్న గింజలతో తయారు చేసిన సీసాలో నీటిని రూ. 40 విక్రయించేందుకు అనుమతిచ్చినట్లు చెప్పారు. ఇక మూత తెరవని కూల్ డ్రింక్స్ మాత్రమే కొండపైకి అనుమతిస్తామన్నారు. కొండపైన జరిగే వివాహాలకు కూడా ఈ షరతులు వర్తిస్తాయని తెలిపారు. అందరూ రూల్స్ పాటించేలా తనిఖీలు చేపడతామన్నారు.

మరోవైపు అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో వ్రతం నిర్వహించే పురోహితులకు ఈవో పలు సూచనలు చేశారు. వ్రతం ఆచరించుకునే వారి నుంచి పురోహితులు అన్నదానం, వస్త్రదానం పేరుతో డబ్బులు డిమాండ్‌ చేస్తే సహించేది లేదన్నారు. అలా చేస్తే వ్రత కథ చెప్పిన పురోహితుడిని విధుల నుంచి పూర్తిగా తొలగిస్తామన్నారు. వ్రతం టికెట్టుపై 40శాతం పురోహితులకు ఇస్తున్నట్లు బోర్డులు పెడతామన్నారు.

Tags:    

Similar News