పవన్ అరటిపండులాంటోడు..అంబటి షాకింగ్ కామెంట్స్

By :  Shabarish
Update: 2024-02-20 12:09 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండులాంటి వాడని ఎద్దేవా చేశారు. పవన్ ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారో ఎవ్వరికీ తెలియదన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూసుకుందామని టీడీపీ, జనసేనకు అంబటి రాంబాబు ఛాలెంజ్ విసిరారు. అమరావతిలో అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ, జనసేనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ తన వారాహి వాహనాన్ని షెడ్డులో పెట్టేశారని, చంద్రబాబు రా కదలి రా అంటుంటే ఎవ్వరూ రావడం లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు వైసీపీ చేపడుతున్న సిద్ధం సభలు విజయవంతం అవుతున్నాయన్నారు. టీడీపీకి ముందుంది ముసళ్ల పండగ అని, చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ జుట్లు పీక్కోవాల్సి వస్తుందని అంబటి అన్నారు. మరోవైపు కుర్చీలు మడతపెట్టడంలో నారా లోకేశ్ గిన్నిస్ రికార్డుకెక్కారన్నారు.

టీడీపీ కుర్చీని కూడా లోకేశ్ మడతపెట్టేశారని, ఆయన మాటలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ 175కు 175 సీట్లు సాధిస్తారని, టీడీపీ మేనిఫెస్టో అంటేనే ఓ తెల్ల కాగితం అని విమర్శించారు. సీఎం జగన్ సిద్ధం సభలను చూసి టీడీపీ భ్రమలు తొలగిపోయాయని అన్నారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెబితే వినడానికి అంతగా బాలేదని, చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం వల్ల పెద్దగా లాభం లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, టీడీపీ, జనసేనలకు ప్రజలే బుద్ధి చెబుతారని అంబటి రాంబాబు అన్నారు.


Tags:    

Similar News