రాజకీయాల్లో జీరో.. పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా విమర్శలు

Update: 2023-07-19 07:21 GMT

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ దళపతి కాదని, ఆయన దళారి అంటూ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఢిల్లీలో దళారిగా మారారని వ్యాఖ్యానించారు. తన తల్లిని తిట్టిన వ్యక్తి కోసం పవన్ దళారిగా మారడం సిగ్గుచేటని చెప్పారు. పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక మళ్లీ టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను అంటూ గతంలో ప్రగల్భాలు పలికిన పవన్... ఇప్పుడు సిగ్గు లేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని పవన్ ఢిల్లీలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ... మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని సిగ్గులేకుండా చెప్పారని అన్నారు. పవన్‌ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని ఎద్దేవా చేశారు. ఆనాడు ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోను.. గొంతు కోసుకుంటా అన్నాడు. ఇప్పుడేమో పొత్తులు అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. సిగ్గులేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నాడు అని అన్నారు.

మోదీని తిట్టిన చంద్రబాబును ఎన్డీయే సమావేశానికి పిలవలేదని... కానీ, తన తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్ ఎన్డీయేతో కలిసిపోయాడని రోజా విమర్శించారు. చంద్రబాబు ఊసరవెల్లి అనే విషయం బీజేపీకి తెలుసని... అందుకే ఎన్డీయే సమావేశానికి పిలవలేదని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని చెప్పిన చంద్రబాబు... చివరకు కాంగ్రెస్ ను కూడా మోసం చేశారని అన్నారు.

Tags:    

Similar News