కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా? ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోనుందా? అంటే అవునేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, కర్నాటక కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో కలిశారు. దీంతో ఈపుకార్లకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ,డీకే శివకుమార్లు గురువారం బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో పరస్పరం ఎదురుపడ్డారు.
కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా.. అదే టైంలో డీకే శివకుమార్ కూడా ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. కాంగ్రెస్ ఆవిర్భావ సభ కోసం నాగ్పుర్ వెళ్లేందుకు డీకే బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. రెండు విమానాలు పక్కపక్కనే ఉండి.. పరస్పరం ఎదురుకావడంతో ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. డీకే.. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి కాసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగానే కలిశారని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత, సంధి జరగలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి.