అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-20 05:33 GMT

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. బాధితులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని స్పష్టం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి సీదిరి అప్పలరాజుని ఆదేశించారు సీఎం జగన్. ఇక, బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని అధికారులకు సూచించారు.




 


కాగా, విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అర్ధరాత్రి చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మత్స్యకారులందరూ గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం వారందికీ కాళరాత్రిగా మారింది. ఈ ప్రమాదంలో సుమారు 50 బోట్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి. రూ.40 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా. ఎవరో ఆకతాయిలు చేసిన పని వందలాదిమంది మత్స్యకార కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న జీవనాధారమైన బోట్లు కళ్ల ఎదుట అగ్నికి ఆహుతి అయిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే, అగ్ని ప్రమాదం ఘటనలో ఓ యూట్యూబర్ పై కేసు నమోదు చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి సదరు యూట్యూబర్ ఫిషింగ్ హార్బర్ లో పార్టీ ఇచ్చాడని సమాచారం. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. యూట్యూబర్ పరారీలో ఉన్నట్టుగా సమాచారం. అయితే, యూట్యూబర్ ను పట్టుకోవడానికి మూడు బృందాలను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది.




Tags:    

Similar News