ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ అధిష్ఠానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ప్రభుత్వం మార్పు తప్పదన్నారు నారాయణ. జగన్ పాలనలో అహంకారం, నియంతృత్వం పెరిగిపోయిందన్నారు. హెలికాప్టర్లో తిరిగితే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించిన నారాయణ.. సీఎం పర్యటన కోసం మనుషులను నిర్బంధించడం దారుణమని విమర్శించారు.
కాగా వీలు చిక్కినప్పుడల్లా జగన్ ప్రభుత్వంపై నారాయణ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా.. పోలింగ్ జరుగుతుంటే నీటిని అడ్డంపెట్టుకుని నాగార్జునసాగర్ వద్ద జగన్ ప్రభుత్వం నాటకమాడిందని ఆరోపించారు. కేసీఆర్ను(KCR) గెలిపించడం కోసం ఆయన కుట్ర పన్నారని విమర్శించారు.