Purandeswari : పొత్తులపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Update: 2024-02-11 11:45 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. ఏపీ పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుదని అన్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారు అయ్యింది. ఇక బీజేపీ మాత్రమే పొత్తును ఖరారు చేయాల్సి ఉంది. ఈ మూడు పార్టీలు కలిసి వైసీపీకి గట్టి పోటీని ఇస్తాయని, ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దింపాలని అవి భావిస్తున్నాయి.

ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పొత్తులపై స్పందించారు. పొత్తులపైనే ఆధారపడి తాము ఏ కార్యక్రమాన్ని చేపట్టబోమని అన్నారు. తమ ప్రయత్నాలన్నీ కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఉంటాయన్నారు. 2014కి ముందు దేశంలో అవినీతి స్కామ్‌లు జరిగాయని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఎక్కడా అవినీతి అనేది జరగలేదన్నారు. భారతదేశ రూపురేఖలే మారిపోయాయన్నారు. ఉచితాలకు, సంక్షేమానికి చాలా తేడా ఉందని, ఏపీలో ప్రజలు ఇప్పుడు అదే గ్రహించాలన్నారు.

బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి పొత్తులపై ఓ నిర్ణయానికి వస్తారన్నారు. పొత్తుపై ముగ్గురు నేతలు సమీక్ష చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీ అరాచకాలు ఎక్కువవుతున్నాయని, మద్యం ఏరులైపారుతోందని, అవినీతి కమ్ముకుపోయిందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రజలకు ఉచితాలు ఇస్తున్నప్పటికీ సంక్షేమానికి పెద్దపీట వేయని ప్రభుత్వం ఎక్కువకాలం పాటు ఉండదన్నారు. బీజేపీ నాయకత్వంలోనే దేశం, రాష్ట్రం కూడా ముందుకు వెళ్తుందన్నారు.


Tags:    

Similar News