కూతురే కొడుకై..తండ్రికి తలకొరివి పెట్టింది..

Update: 2023-06-07 07:33 GMT

కాలం మారుతోంది. కాలంతో పాటు మనుషులు మారుతున్నారు. జెట్ స్పీడ్‎తో టెక్నాలజీ పరుగులుపెడుతోంది. పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నారు. తమ సత్తాను చాటుతున్నారు. లింగభేదాలు లేకుండా ప్రతి పనిలో మగువలు ముందుంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాల్లో స్త్రీలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. పితృకర్మలు పురుషులే చేయాలనే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మగపిల్లలు లేకపోతే చుట్టాలు ఆ కర్మలు నిర్వహిస్తారు కానీ మహిళలను ఇలాంటి పనులకు దూరంగా ఉంచుతున్నారు. పేరెంట్స్ కూడా కొడుకులే తమ అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరుకుంటారు. ఎందుకంటే వారే తమను పున్నామ నరకం నుంచి తప్పిస్తారని భావిస్తారు. కానీ కొంత మంది మహిళలు ఈ విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు. కొడుకులకు తామేమి తక్కువేం కాదని నిరూపిస్తున్నారు.

బాపట్లజిల్లా చిన్నగంజాం మండలం సోపిరాల గ్రామానికి తుమ్మలపెంట వెంకట్రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం అరోగ్యం క్షీణించడంతో మరణించాడు. వెంకట్రావుకు కొడుకులు లేరు. ఇద్దరూ కూతుర్లే.

ఈ క్రమంలో వెంకట్రావు పెద్ద కూతురు కొడుకు అవతారమెత్తి తన తండ్రి అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించింది. తండ్రికి తలకొరివి పెట్టి ఆయన రుణం తీర్చుకుంది. ఈ సంఘటన గ్రామస్తులను కలచివేసింది. ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.    

Tags:    

Similar News