విద్యార్థులకు గుడ్ న్యూస్..6 లక్షల ట్యాబ్‎లు ఇవ్వనున్న ఏపీ సర్కార్

Update: 2023-06-05 05:27 GMT

వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సార్కార్. ప్రభుత్వ స్కూల్స్‎లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కొత్త విద్యా సంవత్సరలో 8వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. స్టూడెంట్స్ తో పాటు టీచర్లకు ట్యాబ్‌లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

గత ఏడాది ప్రభుత్వం విద్యార్థులకు, టీచర్లకు కలిపి 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా ఇచ్చింది. 8, 9 తరగతుల స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా రూ. 25 వేల ఖరీదు చేసే బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. అంతేకాదు ఏమైనా సమస్యలు వచ్చినా మూడు రోజుల్లో పరిష్కారం అందించే విధంగా సర్కార్ ప్రత్యేక యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచింది. అదే విధంగా ట్యాబ్ ల నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చింది.

సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లను స్పెషల్ గా తయారు చేయించారు. ఈ ట్యాబ్‌ల్లో నిక్షిప్తమైన కంటెంట్‌‎ను ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఉపయోగించుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా విద్యార్థి ఏ సబ్జెక్ట్‎ను ఎన్ని గంటలు చూశారు, దేనికి ఎక్కువ సమయం కేటాయించారు వంటి వివరాలు కూడా నమోదవుతుంది. ట్యాబ్‎లను ట్యాంపరింగ్ చేసే వీలు లేకుండా కట్టడి కూడా చేశారు. కంటెంట్‎ను డిలీట్ చేసే ప్రయత్నం చేసినా..మార్పులు చేసేందుకు యత్నించినా వెంటనే ట్యాబ్ లాక్ అవుతుంది. వెంటనే ఆ ట్యాబ్ వివరాలన్నీ కూడా ఇబ్రహీంపట్నంలోని స్టేట్‌ ఐటీ సెల్‌కు, విశాఖలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరిపోతాయి. ఆ తరువాత కారణాలు తెలుసుకుని ఓటీపీ ద్వారా జిల్లా నోడల్‌ అధికారి ట్యాబ్‎ను అన్‌లాక్‌ చేస్తారు.

Tags:    

Similar News