Krishna Express: ప్రయాణికులకు అలర్ట్.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రద్దు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-10 03:10 GMT

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ కోసం ఎదురుచూసే తిరుమల భక్తులకు అలర్ట్. ఈరోజు లేదా రేపు తిరుమలకి రైలు ప్రయాణం ద్వారా వెళ్లాలనుకుంటే మాత్రం మీ ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిది. లేదంటే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని(ప్రయాణాన్ని) ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌- తిరుపతి మధ్య కాజీపేట మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10, 11 తేదీలలో రద్దు కావడమే అందుకు ముఖ్య కారణం. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో జరిగే ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ రెండ్రోజులు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి తిరిగి నగదు చెల్లిస్తామని వివరించారు. గడిచిన రెండు వారాల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం ఇది రెండోసారి. ఈ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను పేదవాళ్ల రైలుగా పిలిచుకుంటుంటారు. తిరుమల వెళ్లడానికి చాలామంది ప్రయాణికులు ఈ రైలుకే ప్రాధాన్యమిస్తారు.

మరోవైపు మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు. కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ ప్యాసింజరు, సికింద్రాబాద్‌- వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌, కాజీపేట -బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ రైళ్ల రద్దును దృష్టిలో పెట్టుకుని జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వేశాఖ అధికారులు సూచించారు. అంతేకాదు విజయవాడ డివిజన్ పరిధిలో కూడా కొన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.




Tags:    

Similar News