ఎవరికిచ్చారు ఎక్స్‌గ్రేషియా .. ఎవరికి కావాలి మీ డబ్బులు: టీటీడీని కాస్త గట్టిగానే..

Update: 2023-08-16 03:45 GMT

తిరుమలలో చిరుత దాడిలో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచి వేసింది. ఈ ఘటనపై అక్కడి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చిన్నారి తల్లిదండ్రుల మీద అనుమానం ఉందని చెబుతుంటే.. చిన్నారి మరణంలో అటవీ శాఖ, టీటీడీ తప్పు లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు. అంతేగాక చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు చెప్పారు. ఈ మాటలు మీడియాలో వైరల్ కావడంతో.. చిన్నారి లక్షిత తాత శ్రీనివాసులు.. టీటీడీ, రాజకీయ నేతలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఎక్స్ గ్రేషియా ఎవరికి ఇచ్చారు.. ఎవరికి అందచేశారు. ఏ లబ్ది కోసం ఇలా చేస్తున్నారు.. ఎందుకు ఇలాంటి తప్పుడు మాటలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జింకలకు ఇచ్చే రక్షణ మనుషులకు లేదు

మా పాప విలువను రూ.10 లక్షలుగా నిర్ణయించారు.. మా పాప ప్రాణాల విలువ రూ.10 లక్షలా? అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కానీ, మాకు ప్రభుత్వం నుంచి గానీ, ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి గానీ రూపాయి సాయం అవసరం లేదు.. చివరకు అణా పైసా సాయం కూడా తీసుకోవడానికి మేం సిద్ధంగా లేమంటూ మండిపడ్డారు. జింకలకు ఇచ్చే రక్షణ మనుషులకు లేదని.. జింకలను స్వేచ్ఛగా వదిలితేనే చిరుతలు, పులులు మనుషుల వైపు రావని ఆయన పేర్కొన్నారు. జింకలను ఎందుకు బంధిస్తున్నారని శ్రీనివాసులు ప్రశ్నించారు. అసలు జింకలను బంధించడానికి మీరు ఎవరు? అడవిలో వాటిని వదిలేయండి.. అప్పుడు మనుషుల కోసం జంతువులు రావు కదా? అని సూచించారు.

అలా చేసి ఉంటే ప్రాణం పోయేది కాదు

పులి సంచారం వున్నట్లు పత్రికల్లో వస్తున్నా.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. కంచ వేసి వుంటే తమ బిడ్డ ప్రాణాలతో వుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని శ్రీనివాసులు కోరారు.కంచ వేసి ఉంటే నా బిడ్డకు ఏమీ అయ్యుండి కాదన్నారు.. ఎందుకు మీకు ఆలోచన రాలేదు అంటూ టీటీడీ, రాజకీయ నేతలపై విరుచుకుపడ్డారు. నాయకులు వస్తే భద్రత కల్పిస్తారని.. కానీ మా లాంటి వాళ్ల ప్రాణాలకు రక్షణ ఉండదా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.



Tags:    

Similar News