నిన్నటి దాకా అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా.. వైసీపీ ఎమ్మెల్యే

Byline :  Veerendra Prasad
Update: 2024-01-28 16:26 GMT

ఏపీలోని నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలిసింది .ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో పల్నాడు జిల్లా నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలో దింగేందుకు తాను రెడీగా ఉంటానని పేర్కొన్నారు. జగనన్న గీసిన గీతను ఎప్పుడూ దాటనని చెప్పారు. నిన్నటి దాకా చంద్రబాబును అసెంబ్లీలో తిట్టానని.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతానని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి సీఎం జగన్ పెట్టిన భిక్ష అని చెప్పారు. గూడూరులో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్న ఏది చెబితే అది శిరోధార్యమని పేర్కొన్నారు.

ఇదిలాఉండగా అంతకుముందు నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈయన తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావుకేకలు పెడతాడు... కానీ అభివృద్ధి గురించి అడిగితే నోరు కూడా తెరవడు... ఈయనొక పెద్ద ఎమ్మెల్యే! దొంతాలి వద్ద బినామీల పేరుతో రూ.100 కోట్ల విలువ చేసే 50 ఎకరాల ఆస్తి కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీల పేర్లతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీల పేర్లతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసి ఇక్కడి ప్రజలు ఛీ కొడుతుంటే... ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటీ చించేశాడు. ఇక్కడ్నించి ఎక్కడికో పంపిస్తాడట ఇతడ్ని. ఇంకా గాల్లో ఊగిసలాడుతున్నాడు" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గానే అనిల్ కుమార్ యాదవ్ ఢిల్లీలో తిడతానంటూ చెప్పారు.

Tags:    

Similar News