Ambati Rayudu: పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు

Byline :  Bharath
Update: 2024-01-10 15:10 GMT

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరారు. ఇవాళ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. త్వరలోనే రాయుడు జనసేన కండువా కప్పుకుంటానే అవకాశం ఉంది. ఇటీవలే వైసీపీకి రాయుడు రాజీనామా చేశారు. ఆ పార్టీలో చేరి 10 రోజులు కూడా కాకముందే రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న రాయుడు.. జనవరి 6న ఆ పార్టీని వీడుతున్నట్లు ట్వీట్ చేశారు. కాగా తాజాగా ఆ పార్టీని ఎందుకు వీడుతున్నారో క్లారిటీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ఐడియాలజీ తన ఆలోచనలకు దగ్గరగా ఉందని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. అందుకే జనసేనలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇవాళ పవన్ తో భేటీ ముగిసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. ‘ఏపీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చా. కానీ, వైసీపీతో ప్రయాణంలో నా కలలు నెరవేరవని అర్థమయింది. నా ఐడియాలజీ, వైసీపీ ఐడియాలజీకి భిన్నంగా ఉంది. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశా. మొదట రాజకీయాలను వదిలేద్దామనుకున్నా. కానీ నా సన్నిహితుల సూచనతో పవన్ అన్నను కలిశా. ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపా. రాజకీయ పరంగా, ఏపీ డెవలప్మెంట్ పరంగా చాలా మంచి ఆలోచన ఉంది ఆయన దగ్గర. ప్రస్తుతం క్రికెట్ టోర్నీ కోసం దుబాయ్ వెళుతున్నా. నేనెప్పుడూ ఏపీ ప్రజలకు అండగా ఉంటా' అని ట్విట్ లో చెప్పుకొచ్చారు.




Tags:    

Similar News