ఏపీలో నాసిన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Byline :  Krishna
Update: 2024-01-16 11:55 GMT

ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మించిన నాసిన్ సెంటర్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్)ను సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామంలో రూ.1500 కోట్లతో ఏర్పాటు చేశారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్లకు, ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఇందులో శిక్షణ ఇస్తారు. పదేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీకి పరిహారంలో భాగంగా ఈ సెంటర్ ఏర్పాటైంది. 2015 ఏప్రిల్లో ఈ సెంటర్కు శంకుస్థాపన చేశారు.

నాసిన్‌ను 503 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఐఆర్ఎస్ అధికారులకు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో శిక్షణ ఇవ్వడం ఈ సెంటర్ ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాల ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, మిత్రదేశాల అధికారులకు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు. వర్చువల్ సమావేశాలతోపాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లర్నింగ్ వంటి అత్యాధునిక బోధనా వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. కస్టమ్స్, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, డ్రగ్స్ నిరోధక చట్టాలు, మనీల్యాండరింగ్ నిరోధక చట్టాలు, దొంగనోట్లను అరికట్టే విధానాలపై శిక్షణ ఇస్తారు.

నాసిన్‌లో పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మిస్తున్నారు. వందల మంది ఉద్యోగులకు, ఇతర సిబ్బందికి క్వార్టర్లు ఏర్పాటు చేశారు. పోస్టాఫీస్, బ్యాంకు, సూపర్ మార్కెట్ వంటి మరెన్నో సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక రైల్వేలైన్‌, ఈఎస్ఐ ఆస్పత్రి కూడా రాబోతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం 3 లక్షల మొక్కలు నాటుతారు. నాసిన్‌ను భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. నాసిన్ ఏర్పాటుతో పాలసముద్రం గ్రామం కూడా అభివృద్ధి చెందనుంది. కరువు పీడిత ప్రాంతంలో జాతీయ సంస్థ రావడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. వెనక బడిన రాయలసీమకు ఇలాంటి మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాలని స్థానిక ప్రజలు, నాయకులు కోరుతున్నారు.

Tags:    

Similar News