కంద గడ్డకు అరటిగెల...కోనసీమ జిల్లాలో వింత ఘటన

By :  Aruna
Update: 2023-09-29 10:27 GMT

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఓ వింత సంఘటన జరిగింది. ఐ.పోలవరం మండలం తిళ్ళకుప్ప గ్రామానికి చెందిన రైతు వేగిరాజు సుబ్బరాజు ఇంటి పెరట్లో కంద గడ్డకు విచిత్రంగా అరటి గెల కాసింది. భూమిలో పెరిగిన సుమారు రెండు కేజీల బరువున్న కందకు అరిటి గెల వేయడంతో అక్కడి వారంతా అవక్కయ్యారు. అరటి చెట్టుకు గెలనిండా అరటి కాయలు ఎలా వస్తాయో అదే విధంగా కందకు అరిటి గెల రావడంతో చూపరులను ఒకింత షాక్‎కు గురిచేస్తోంది. ఇదేం విచిత్రం అంటూ గ్రామస్థులు ఈ కందను చూసేందుకు రైతు ఇంటికి పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. వీరబ్రహ్మం కాలజ్ఞానంలో చెప్పినట్టు జరిగిందంటూ ఆ కందకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు.

ఎప్పటిలాగే పొలం పనులకు వెళ్లే సుబ్బరాజుకు ఇంటి ఆవరణలో వింతగా ఓ మొలక కనిపించింది. అదేంటని దగ్గరికి వెళ్లి చూడగానే షాక్ అయ్యాడు. కంద గడ్డకు భూమి లోపలి నుంచి విచిత్రంగా ఒక అడుగు ఎత్తు కాండం పైకి వచ్చింది. దీనికి అరటి గెల వేసింది. గెలనిండా చిన్న చిన్న అరటికాయల అస్తాలతో చూపరులకు ఆకట్టుకుంటోంది. ఈ వింతను చూసి రైతు కుటుంబంలోని వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్త ఆనోట ఈనోట చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో ఈ వింతను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే జరుగుతోందని అందరూ చర్చించుకుంటున్నారు.


Tags:    

Similar News