చిలకలూరిపేటలో ఉద్రిక్తత.. పోలీస్ కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

By :  Krishna
Update: 2023-09-09 10:13 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు కాన్వాయ్కు అడ్డంగా బైఠాయించి నిరసన చేపట్టారు.

చంద్రబాబు దిగివచ్చి దారివ్వాలని విజ్ఞప్తి చేసినా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. చాలాసేపటి తర్వాత కార్యకర్తలు శాంతించి వెనక్కి తగ్గడంతో కాన్వాయ్ ముందకు కదిలింది. కాగా సాయంత్రం లోపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయన్ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు చెప్పారు. ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నిరూపితమైతే పదేళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చని తెలిపారు.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్పై ఆయన సతీమని నారా భువనేశ్వరి స్పందించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మను ఆమె దర్శించుకున్నారు. తన భర్తకు మనోధైర్యం ఇవ్వాలని దుర్గమ్మను వేడుకున్నట్లు చెప్పారు. ‘‘చంద్రబాబు రాష్ట్ర ప్రజల బాగు కోసం పోరాటం చేస్తున్నారు. ఎవరికైనా మనసు బాగాలేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు. అందుకే నా బాధ చెప్పుకోవడానికి అమ్మవారి దగ్గరకు వచ్చా. అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమవ్వాలి’’ అని భువనేశ్వరి అన్నారు.


Tags:    

Similar News