అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇవే తన చివరి ఎన్నికలు అంటూ బాంబు పేల్చారు. వచ్చే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సంచలన కామెంట్స్ చేశారు. వయసు అయిపోతుందని..ప్రస్తుతం తన వయసు 52 ఏండ్లన్నారు. 2029 ఎన్నికల నాటికి తనకు రిటైర్మెంట్ వయసు వస్తుందని చెప్పారు. అంతేగాక రాజకీయవారసత్వం పై మాట్లాడుతూ తన కూతుళ్లకు పాలిటిక్స్ పై ఆసక్తి లేదన్నారు.
అంతేగాక వైసీపీ మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి అవసరం లేదన్నారు. తన నియోజకవర్గంలో రోడ్లకు పర్మినెంట్ గా స్ట్రక్చర్ వేయాలని... రోడ్లు, కాలువలు, వాల్స్ కు సీఎం జగన్ డబ్బులిస్తే చాలని చెప్పారు. నియోజకవర్గంలో ఇంకా రూ. 500 నుంచి రూ. 600 కోట్ల వరకు ఖర్చయ్యే పనులు ఉన్నాయన్నారు. ఈ పనులు పూరైయిన తర్వాత తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చుకున్నా తనకు అనవసరమని చెప్పారు. అయితే ఇవే తనకు చివరి ఎన్నికలు కొడాలి చెప్పడంపై వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సింపథీ కోసమే కొడాలి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.