స్కూటీపై వెళుతున్న మహిళను అడ్డగించి యాసిడ్ దాడి

Update: 2023-06-14 02:47 GMT

ఏపీలోని ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక విద్యానగర్‌ మానిస్ట్రీ దగ్గరలో నివాసం ఉంటున్న ఓ వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడి చేశారు. రాత్రి స్కూటీపై వెళుతుండగా దుండగులు యాసిడ్ చల్లడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పతిలో చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు. అయితే, ఆమె కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని విద్యానగర్‌ మానిస్ట్రీ దగ్గరలో నివాసం ఉంటున్న యడ్ల ప్రాంచిక (35) భర్త ఆంజనేయులుతో ఏడాది క్రితం గొడవ కారణంగా వేరుగా ఉంటోంది. ఆంజనేయులు రాజమండ్రిలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ప్రాంచిక తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో తన పుట్టింటి వారితోనే ఉంటుంది. రెండు నెలల క్రితం విద్యానగర్‌లో ఓ ప్రైవేటు డెంటల్‌ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా చేరింది. అయితే, మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీ దిగి తన స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. మానిస్ట్రీ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఆగి అకస్మాత్తుగా ఆమెపై యాసిడ్‌ పోశారు. ఆమె కేకలు వేస్తూ సమీపంలోని ఇంటి వద్దకు వెళ్ళిపోయింది.

ఆమె చెల్లి యడ్ల సౌజన్య, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెపై నీళ్లు పోసి కాలిపోయిన దుస్తులను మార్చి మరో స్కూటర్‌పై ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె రెండు కళ్లు చూపు కోల్పోయినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో బాధితురాలిని డీఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామన్నారు. 

Tags:    

Similar News