సీబీఎస్‌ఈ పరీక్ష‌ల్లో ఓపెన్ బుక్ విధానం!

Update: 2024-02-22 16:29 GMT

దేశవ్యాప్తంగా పరీక్ష విధానంలో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మార్పులకు సీబీఎస్ఈ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కసరత్తు చేస్తోంది. 9 నుంచి 12వ తరగతి పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఎస్ఈ మీడియా-పీఆర్ డైరెక్టర్ రమాశర్మ ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది జరిగిన సీబీఎస్ఈ పాలక మండలిలో ఈ నిర్ణయం జరిగిందన్నారు. కాగా ఈ ఏడాది నవంబర్ నెలలో పైలట్ పరీక్ష నిర్వహిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. 9, 10 తరగతుల మేథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్ పరీక్షలను ఎంపిక చేసిన స్కూళ్లలో ఓపెన్ పద్ధతిలో నిర్వహిస్తారు. అలాగే 11, 12 తరగతుల బయాలజీ, ఇంగ్లిష్, మేథమెటిక్స్ సబ్జెక్టుల్లో పైలట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

కాగా అన్ని స్కూళ్లల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించవచ్చాలేదా అన్నది ఈ పైలట్ పరీక్షల ద్వారా నిర్ణయిస్తారు. ఈ పరీక్షా విధానంలో విద్యార్థులు టెక్ట్స్‌ బుక్స్, స్టడీ మెటీరియల్స్, నోట్స్ చూసి జవాబులు రాసేందుకు అనుమతిస్తారు. ప్రస్తుత పరీక్షా విధానంలో విద్యార్థుల జ్ఞాపకశక్తి కీలకమైతే.. ఓపెన్ బుక్ ఎగ్జామ్‌లో విశ్లేషణా సామర్థ్యం బయటపడుతుంది. అంటే ప్రస్తుత విధానంతో పోలిస్తే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంత తేలిక కాదనే విషయం బోధపడుతుంది. ప్రస్తుత విధానంలో విద్యార్థులు జవాబులను బట్టీ పడుతున్నారని, దాని ద్వారా మేధాశక్తి పెరిగేందుకు పెద్దగా ఛాన్స్ లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ఓపెన్ బుక్ పరీక్ష వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.



Tags:    

Similar News