JEE Main 2024 Session 1 Exam : నేటి నుంచే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు..

Byline :  Veerendra Prasad
Update: 2024-01-24 02:02 GMT

దేశవ్యాప్తంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్షలకు అంతా సిద్ధమైంది. నేటి( జనవరి 24 ) నుంచి ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. పేపర్‌ 1, పేపర్ 2 పరీక్షలు జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగుతాయి. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షలకు ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ సహా మొత్తం 10 భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్‌‌లో నిర్వహించనున్నారు.

ఇక ఈరోజు నుంచి జరగబోయే పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చామని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసేస్తారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదా ఆధార్‌తో వేలిముద్ర అనుసంధానమై ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే విద్యార్థి పరీక్ష రాసే చోటు తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక విద్యార్ధికి బదులు వేరేవారు పరీక్షలు రాసే అవకాశమే ఉండదంటున్నారు అధికారులు.

బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డుల్ని ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.ac.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేయడం ద్వారా అడ్మిట్‌కార్డుల్ని పొందొచ్చు. జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్‌టీఏ ప్రకటించింది. ఈసారి భద్రత వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. 

పరీక్ష కేంద్రాలకు ఏమేం తీసుకువెళ్లాలంటే..

అడ్మిట్‌ కార్డులో సూచించిన సమయానికి విద్యార్ధులు తప్పనిసరిగా పరీక్ష రాసే ప్రదేశానికి చేరుకోవాలి.

ఆధార్‌/ పాస్‌పోర్టు/ రేషన్‌కార్డు/ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ట్రాన్స్‌పరెంట్‌ పెన్‌, అడ్మిట్‌ కార్డు, బీఆర్క్‌ పరీక్షకైతే పెన్సిల్‌, స్కేల్‌, రబ్బర్‌, జామెంట్రీ బాక్స్‌, వాటర్‌ బాటిల్‌ వెంట తీసుకెళ్లాలి.

పరీక్ష సమయంలో ఇన్వజిలేటర్‌ రఫ్‌ వర్క్‌కు పేపర్లు ఇస్తారు. పరీక్ష అనంతరం రఫ్‌ బుక్‌లెట్‌ను డ్రాప్‌బాక్స్‌లో వేయాలి.  




Tags:    

Similar News