మహారాష్ట్రలో దారుణం.. మేకలను ఎత్తుకెళ్లారన్న అనుమానంతో..

By :  Kalyan
Update: 2023-08-28 06:57 GMT

మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మేకలు దొంగలించారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను కొందరు వ్యక్తులు చిత్రహింసలు పెట్టారు. చెట్టుకు తాళ్లతో కట్టి తలకిందులుగా వేలాడదీసి విచక్షణారహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా హరేగావ్లో ఓ వ్యక్తికి చెందిన మేకలు, పావురాలు కన్పించకుండా పోయాయి. వారి ఇంటి సమీపంలోనే ఉండే నలుగురు దళిత యువకులపై వారికి అనుమానం కలిగింది. దీంతో ఆగస్టు 25న ఆరుగురు వ్యక్తులు నలుగురు దళిత యువకులను బలవంతంగా తీసుకొచ్చి.. చెట్టుకు తలకిందులుగా వేలాడిదీసి కట్టెలతో కొట్టారు. దొంగతనం చేయలేదని వారు ఎంత చెప్పినా సదరు వ్యక్తులు వినలేదు. వారిని హింసిస్తున్న ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మిగితావారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు బాధ్యలను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగాయి. విపక్షాలు సైతం ఈ ఘటనను ఖండించాయి. మానవత్వానికే మచ్చ అని మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags:    

Similar News