ఖర్జూరం తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

By :  Aruna
Update: 2023-12-28 10:26 GMT

శీతాకాలంలో మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ క్రమంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ప్రధానమని నిపుణుల చెప్పే మాట . ఈ సీజన్‎లో ఏది పడితే అది తినకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధి క్రిములు మనజోలికి రాకుండా నిరోధించవచ్చు. ముఖ్యంగా మన శరీరానికి విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు అవసరం. ఇవన్నీ ఒక్క ఖర్జూరాల్లోనే పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. నిగనిగ మెరిసిపోతూ కనిపించే ఖర్జూరాలు తినడానికి మధురంగా ఉండటమే కాదు పోషకాల విషయంలో రారాజు. అందుకే ఖర్జూరాలను ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. ఒక స్టడీ ప్రకారం ఖర్జూరంలో ఉండే 15 రకాల మినరల్స్‌ క్యాన్సర్‌ కణాలతో శక్తివంతంగా పోరాడి, శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాట. ఖర్జూరంలో 23 అమైనో యాసిడ్స్‌, పాల్మిటోలిక్‌, ఒలీక్, లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్‌‌‌‌ వంటి అన్‎సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. మరి ఈ ఖర్జూరంలోని పోషకాలను మనం పొందాలంటే.. రోజుకు 3 ఖర్జూరాలు మాత్రం తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.మరి చలికాలంలో ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

తాజా అధ్యయనాల ప్రకారం ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఆర్టీరియల్ సెల్స్ నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో హెల్ప్ చేస్తాయి. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తింటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌‎ను తగ్గించుకోవచ్చు. హార్ట్ ఎటాక్, హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఖర్జూరాలలో లభించే పొటాషియం హార్ట్‌ బీట్, బీపీని నార్మల్‌గా ఉంచుతాయి. ఖర్జూరంలో కాల్షియం అధికంగా లభిస్తుంది. ఇది ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే పొటాషియం, ఫాస్ఫరస్‌ , సెలీనియం, కాపర్‌, మాంగనీస్‎లు ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి సమస్యల నుంచి కాపాడుతాయి. ఖర్జూరంలో పుష్కలంగా లభించే విటమిన్-కె ,రక్తం గట్టిపడటానికి, ఎముకల జీవక్రియలోనూ సహాయపడుతుంది.

ఒక అధ్యయనం ప్రకారం మగవారిలో ఖర్జూరాలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయట. ఇక ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 మెదడు చురుగ్గా పనిచేయడానికి సహకరిస్తుంది. అంతేకాదు స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్‌ నుంచి మెదడును కాపాడటంతో పాటు నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే న్యూరోడీజెనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది. అందుకే ఖర్జూరాన్ని తరచుగా తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మారిన జీవనశైలి, ఆహారం క్యాన్సర్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఖర్జూరంలో ఉండే పోషకాలతో కోలన్‌ క్యాన్సర్‌, పెద్దపేగు, ప్రోస్టేట్‌, రొమ్ము, ఎండోమెట్రియల్‌, లంగ్స్, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందంటున్నారు. ఖర్జూరంలో నీటిలో కరిగేవి, కరగనివి అంటు రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ సక్రమంగా పనిచేయటానికి, మలబద్ధకం సమస్య దరిచేరకుండా ఉండటానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇక ఖర్జూరంలో ఉండే ప్రొటీన్లు, ఐరన్, ఇతర విటమిన్లు మజిల్ స్ట్రెంత్ కి హెల్ప్ చేస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్‎ను పెంచుతాయి. అందుకే ఖర్జూరాలను రోజూ తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అందుకే ప్రతి రోజు మరిచిపోకుండా మూడు ఖర్జూరాలను మీ మెనూలో యాడ్ చేసుకుని హెల్దీగా ఉండండి.

Full View




Tags:    

Similar News