సమసమాజ స్థాపకుడు కామ్రేడ్ లెనిన్

Byline :  Vijay Kumar
Update: 2024-01-20 11:59 GMT

జారిస్టు రష్యాను సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా మార్చి ప్రపంచ చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన విప్లవ మేధావి కామ్రేడ్ లెనిన్. నవంబరు విప్లవం, సోవియట్ విప్లవం అని ప్రపంచం వేనోళ్ల కీర్తించే రష్యా విప్లవానికి వ్యూహరచన చేసిన కార్యశీలుడు లెనిన్. విప్లవ అవకాశాలు సృష్టించి, వాటిని చేజిక్కించుకోమని రష్యా కార్మికవర్గాన్ని ఉత్తేజపర్చిన కలం, గళం లెనిన్. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే ప్రతి గొంతులోనూ అజరామరంగా నిలిచే పేరు లెనిన్. "లెనిన్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎంత చెప్పినా.. ఎన్ని చెప్పినా .. ఇంకా చెప్పాల్సినవి ఎన్నో మిగిలిపోయాయనిపించే మహోన్నత జీవితం ఆయనది. జీవించి ఉన్నప్పుడు ఆయన ఓ తండ్రీ, గురువు, సలహాదారుడు, సహచరుడు. ఇప్పుడు ఆయన సాంఘిక విప్లవానికి దారి చూపే ధృవ తార. ప్రజల మనసుల్లో ఆయన ఎల్లప్పుడూ జీవించే ఉంటాడు" ప్రపంచ విప్లవయోధుడు, ఫ్రెంచి, అమెరికా సామ్రాజ్యవాడ దేశాలను మట్టిగలిపించి. అత్యంత పేద దేశమైన వియత్నాంలో విప్లవాన్ని సాధించిన హో చి మిన్ అన్న మాటలివి.

లెనిన్ బాల్యం

లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ ఇల్విన్ ఉల్యనోవ్. 1870 ఏప్రిల్ 22న ఒల్గా నది ఒడ్డున ఉన్న సింబ్రిస్క్ పట్టణంలో ఆయన జన్మించాడు. ఆయన తండ్రి ఇల్యానికోలవిచ్ ఉల్యనోవ్ మధ్య తరగతి ఉపాధ్యాయుడు. తల్లి మార్వా అలెగ్జాండ్రినోవా. తల్లిదండ్రులిద్దరూ ప్రగతిశీల భావాలు కలవారు. లెనిన్ తండ్రి ఉపాధ్యాయుడిగా మనస్ఫూర్తిగా గ్రామీణ పేదపిల్లలను అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తుండేవారు. తమ తండ్రి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తద్వారా పొందే ఆనందం, సమ్మిన ఆశయానికి కట్టుబడి నికరంగా పనిచేయటం, పనిలో నిమగ్నమై చేయడం, అలాగే తల్లిదండ్రుల నిరాడంబరతల ప్రభావం లెనిన్ మీద, ఆయన తోబుట్టువుల మీద ఎంతగానో పడింది. బాల్యం నుండే ప్రతి విషయాన్ని గూలంకుషంగా తెలుగు కోవాలన్న అలవాటు సహజంగానే తల్లిదండ్రుల నుండి లెనిన్ కు అబ్బింది. అతి చిన్న వయస్సులో నుండే సమాజంలోని రాచరిక అన్యాయాలపై గొంతెత్తే లక్షణం లెనిన్ కు అలవాటు అయింది. ఈ లక్షణాలు లెనిన్ ను అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్ధిగా నెలబెట్టాయి.

విప్లవ భావాలవైపు

లెనిన్ బాల్యం ముగిసే నాటికి రష్యా అభివృద్ధి నిరోధన రాజ్యం గా మారుతున్నది. కవీన భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా భరించలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితులు లెనిన్ ను విప్లవ, ప్రజాస్వామిక సాహిత్యం వైపు నడిపించాయి. సామాన్య ప్రజల జీవితాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఆయనలో పెరిగింది. సరిగ్గా ఆ సమయంలోనే రెండు బాధాకరమైన సంఘటనలు వెంటవెంటనే ఆయన జీవితంలో జరిగాయి. ఒకటి ఆయన తండ్రి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. కొద్ది నెలల తేడాలోనే ఆయన ఎంతగానో ప్రేమించే అన్న అలెగ్జాండర్ ని జార్ చక్రవర్తిని హత్య చేయటానికి ప్రయత్నించాడన్న ఆరోపణపై ఉరితీయడం జరిగింది. అన్న మరణం లెనిన్ ను కుదిపేసింది. అలెగ్జాండర్ ఉరిఫై రష్యా అంతటా తీవ్ర నిరసన పెల్లుబికింది.

తండ్రి, అన్నల మరణంతో లెనిన్ కటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం పెన్షన్ నిలుపుదల చేసింది. అన్న విప్లవకారుడు కాబట్టి తమ్ముడైన లెనిన్ ను ప్రభుత్వం వెంటాడటం ప్రారంభించింది. స్కూల్ లో అన్నింటిలో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న లెనిన్ ను కాలేజీలో చేకుండా కుట్రలు పన్నారు. అయినా ఎంతో కష్టపడి లెనిన్ న్యాయశాస్త్ర విద్యనభ్యసించి లాయర్ గా మారాడు. అయితే ప్రజలపై ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ ఆయనను వృత్తిపై దృష్టి కేంద్రీకరించకుండా చేసింది.

విప్లవ కార్యాచరణ

17 ఏళ్ల వయస్సులో కాలేజీ నుండి గెంటివేయబడిన వెంటనే ఆయన విప్లవ కార్యా చరణ ప్రారంభమైంది. ప్రభుత్వం ఆయన్ని ఊరు వదిలి పోమ్మని శాసించింది. ప్రతికూల పరిస్థితులను విప్లవోద్యమానికి అనుకూలంగా మలచుకోవటంలో భాగంగా ఆయన తన ప్రవాస జీవితాన్ని దేశంలోని రాజకీయ సాంఘిక, ఆర్థిక విషయాలకు సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించుకున్నాడు. "నేను ప్రవాస జీవితంలో చదివినంత ఎక్కువగా మారే ఏ ఇతర సందర్భాలలోనూ చదవలేదు. తెల్లవారి నుండి రాత్రి వరకు చదువుతూనే ఉండే వాడిని" అని ఆయనే స్వయంగా చెప్పాడు. మొదటితరం మార్క్సిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న మార్క్సిస్టు స్టడీ సర్కిల్ లో లెనిన్ సభ్యుడిగా చేరాడు. మార్క్స్, ఏంగెల్స్ రచనలను రహస్యంగా తెప్పించుకుని ఈ స్టడీ సర్కిల్ లో అధ్యయనం చేసేవారు. కొద్దికాలంలోనే లెనిన్ అసమాన ప్రజ్ఞ, పట్టుదల దేశవ్యాప్తంగానే కమ్యూనిస్టు శ్రేణుల్లో గుర్తింపు తెచ్చాయి. రష్యన్ కమ్యూనిస్టులలో అగ్రగణ్యుడైన ఫ్లెఖనోనివ్ ని కలవడం జరింది. అయితే అప్పటికే ఫ్లెఖనోనివ్ తో అనేక అంశాలపై లెవిన్ విభేదించేవాడు. కార్మికవర్గ అధిపత్యం, రైతాంగంతో మైత్రి వంటి విషయాలు తీవ్రమైన చర్చనీయాంశాలుగా ఉండేవి. ఆ కాలంలోనే లెనిన్ ఐరోపా దేశాలలో పర్యటించటం ప్రారంభించాడు. ఆ దేశాలలో కమ్యూనిస్టు నాయకులతో చర్చలు చేసేవాడు. చివరి దశలో ఉన్న ఏంగెల్స్ ను కలవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. లెనిన్ చార్యాచరణ జార్ చక్రవర్తిని లాక్షించడం ప్రారంభించింది. ఆయనపై విఘా పెరిగింది. జార్ పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను వేధించడం ప్రారంభిం చారు. వృద్ధులైన ఆయన తల్లిని పిలిచి ఒక పోలీసు అధికారి వ్యంగ్యంగా "నీ పెద్దకొడుకు ఉరితాడుకి బలయ్యాడు. ఇప్పుడు రెండోకొడుకు (లెనిన్) ఉరితాడు కావాలని గొడవ చేస్తున్నాడు. జాగ్రత్త' అని హెచ్చరించాడు. అయితే ఇవేమీ లెనిన్ విప్లవ కార్యావరణను తగ్గించకపోగా మరింత ఉధృతం చేయడానికి దోహదపడ్డాయి.

ఉద్యమ నిర్మాణం దిశగా

చెల్లాచెదురుగా ఉన్న కమ్యూనిస్టు గ్రూపులన్నింటినీ ఐక్యం చేయడం, విప్లవ కార్మికోద్యమాన్ని విస్తృత పర్చడం, సైద్ధాంతిక రంగంలో పొరపాటు ధోరణులపై రాజీలేని పోరాటం.. ఈ మూడూ ఆయన ఎంచుకున్న లక్ష్యాలు. ఇందులో మొదటగా 1895లోనే "కార్మికవర్గ విముక్తి పోరాట సమాఖ్య" అనే వేదికను ఏర్పాటు చేశాడు. అయితే వెంటనే ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. 14 నెలల జైలు శిక్ష విధించింది. 3 సంవత్సరాల పాలు సైబేరియాలో ప్రవాసశిక్ష విధించింది. అయితే ఆయన తల్లి ఎన్నో వ్యయప్రయాసాలతో ప్రభుత్వం బయటకు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయన అనేక ప్రాంతాలు తిరగడం ప్రారంభించాడు. ఈ కాలంలోనే కృపస్కయాతో పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా.. ప్రేమ కాస్త పెళ్లిగా మారాయి. రష్యాలో రష్యన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ ఏర్పడటం ప్రవాసంలో ఉన్న లెనిన్ ను ఎంతో సంతోషపర్చింది. అయితే జార్ ప్రభుత్వం ఆ పార్టీ ముఖ్యులను అరెస్ట్ చేసి పార్టీని ఛిన్నాభిన్నం చేసింది.

అక్టోబర్ విప్లవం

దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించడంలో మహత్తర అక్టోబర్ విప్లవం చరిత్రలోనే ఒక ముందడుగు. కార్మికులు, కర్షకుల, మిగిలిన అణగారిన తరగతుు ఒక కొత్త సోషలిస్టు సమాజాన్ని నిర్మించడంలో సఫలీకృతమైన మొట్టమొదటి విప్లవం.1917నవంబరు 7వ తేదీ రష్యన్ విప్లవం జరిగింది. రష్యా కేంద్ర బిందువుగా మధ్య ఆసియా మొత్తం వ్యాపించిన విస్తారమైన సామ్రాజ్యం జార్ చక్రవర్తి ఆధీనంలో ఉంది. అప్పటి జార్ వ్యవస్థ పెద్ద పెద్ద భూస్వాములతో కూడుకున్నది. సామ్రాజ్యంలోని సుసంపన్నమైన 80 లక్షల హెక్టార్లు జార్ ఆధీనంలో ఉండేది. 28,000 మంది భూస్వాముల ఆధీనంలో 167.4 మిలియన్ల (1674కోట్ల) ఎకరాల భూమి ఉండేది.ఈ రకమైన అర్థ ఫ్యూడల్ వ్యవస్థతో కలిసి పెట్టుబడి దారీ వ్యవస్థ అభివృద్ధి చెందడం పరిశ్రమలలోనూ గనులలోనూ గుత్తాధిపత్యానికి దారితీసింది. పెట్టుబడిదారీ వ్యవస్థ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నప్పటికీ రష్యా మిగిలిన యూరప్ దేశాలతో పోల్చిచూస్తే వెనుకబడే ఉండేది. 1914లో జార్ చక్రవర్తి మొదటి ప్రపంచయుద్ధంలో చేరాడు. ఇది సామ్రాజ్యవాదుల మధ్య పోరు. ఇక్కడ ప్రత్యర్థులు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా లాంటి సామ్రాజ్యవాద శక్తులే. ఇవి వలస దేశాలకోసం, వనరుల పై ఆధిపత్యం కోసం పోటీ పడేవి. వీరు లక్షలాది మంది రైతులను, కార్మికులను సైన్యంలో చేర్చుకొని యుద్ధభూమికి పంపారు. జర్మనీతో రష్యా తరఫున పోరాడుతూ వేలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు. భూస్వాముల కొరడా దెబ్బలకు బలైన బానిసల లాగానే ఈ పేద రైతులు బాధలు పడ్డారు. ఈ క్రమంలోనే కామ్రేడ్ లెనిన్ బొల్షివిక్ ఉద్యమాన్ని బాగా నడిపాడు. సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసి రష్యాలో 1917లో సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించాడు. తాను సోషలిస్ట్ రాజ్యాధినేతగా ఉండగానే అనారోగ్యంతో 1924 జనవరి 21న లెనిన్ మృతి చెందారు. ఆయన చనిపోయి నేటికి వందేళ్లు అవుతున్నా.. ఆయన చూపిన మార్గం నిత్యం ఎందరికో స్ఫూర్తిదాయకం. 

Tags:    

Similar News