CM Revanth Reddy : పాతవారికి యధాతధంగా పథకాలు.. కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి - రేవంత్

Byline :  Kiran
Update: 2023-12-30 07:15 GMT

ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై ప్రజలు అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కొత్తగా లబ్ది పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని రేవంత్ సూచించారు.

ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన క్యాంపులకు వచ్చే ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు తాగునీరు, నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.




Tags:    

Similar News