CM Revanth Reddy : న్యూ ఇయర్ వేడుకల్లో సీఎం దంపతుల స్పెషల్‌ అట్రాక్షన్‌

Byline :  Veerendra Prasad
Update: 2024-01-01 02:36 GMT

నూతనసంవత్సర(New year) వేడుకలు రాష్ట్రంలో అట్టహాసంగా జరిగాయి. 2023కి గుడ్‌ బై చెప్పి 2024కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. కేక్ కటింగ్‌లు, డీజే మోతలు, ధూంధాం నృత్యాలు, తీన్‌మార్ స్టెప్పులతో పట్నం నుంచి పల్లె వరకూ ఆటపాటలతో హోరెత్తింది. ఎటుచూసినా నయా జోష్‌తో సంబరాలు అంబరాన్నంటాయి. సాధారణ ప్రజలు మొదలు అధికారులు, రాజకీయ నాయకుల వరకు కొత్తేడాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తెలంగాణ IAS అధికారుల సంఘం క్లబ్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు నిర్వహించారు.

హైదరాబాద్‌ బేగంపేటలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. వేడుకకు హాజరైన అధికారులను సీఎం పేరుపేరునా పలకరించారు. అందరితో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సీఎం దంపతులను సంఘం అధ్యక్షుడు శశాంక్‌ గోయల్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తదితర ఐఏఎస్‌ అధికారులు తమ కుటుంబసభ్యులతో సీఎం దంపతులను కలిశారు. లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్‌ జయప్రకాశ్‌ నారాయణ, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ వేడుకకు ఐఏఎస్ అధికారులు హరిత, నిఖిల, ఆమ్రపాలి, విజయేంద్ర, కుర్రా లక్ష్మీ, శ్రీదేవసేన, శృతి ఓజా, సీఎస్‌ శాంతికుమారితో పాటు తదితరులు హాజరయ్యారు. 




Tags:    

Similar News