ఐదుగురు పిల్లలతో బైక్‌పై హాస్పిటల్‌కు.. ఎందుకో తెలుసా

హెల్మెట్ వాడకుండా.. ఐదుగురి పిల్లలతో

By :  Lenin
Update: 2023-11-26 05:55 GMT



తన వాళ్లు ఆస్పత్రిలో ఉన్నారని, అందుకే అర్జంట్‌గా వెళ్తున్నానంటూ .. పోలీసులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు ఐదుగురి పిల్లలతో బైక్‌పై ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి . అయితే ఆస్పత్రికి ఇంతమందిని ఎందుకు తీసుకుని వెళ్తున్నావ్, ఎవరికి ఏమైంది​ అని మరోసారి ప్రశ్నించగా.. అతడు ఇచ్చిన సమాధానం విని నవ్వుకోవడం పోలీసుల వంతైంది. ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీలో ఈ ఘటన జరిగింది.

లక్నో-అయోధ్య హైవేపై చౌపులా సమీపంలో శుక్రవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఒకే బైక్​పై ఆరుగురు వెళ్లడాన్ని చూసిన పోలీస్ సిబ్బంది ఒకరు వెంటనే ఆ బైకర్ ను ఆపాడు. ఆ బైక్​ నడిపే వ్యక్తికి ముందో ఇద్దరు, వెనుకో ముగ్గురు చిన్నారులు కూర్చున్నారు. బైకర్‌తో కలిపి మొత్తం ఆరుగురు ఒకే బైక్ పై ప్రయాణిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా ఇంత మంది పిల్లలతో ఎక్కడికి వెళ్తున్నావని సదరు మగమహారాజును పోలీసులు ప్రశ్నించారు. దీనికి అతడు నవ్వుతూ.. తన భార్య ఆసుపత్రిలో చేరిందని.. అక్కడ ఆరో కొడుకుకి జన్మనిచ్చిందని సిగ్గుపడుతూ సమాధానం చెప్పాడు. బైక్​పై ఉన్న ఐదుగురు కూడా తన కొడుకులేనని.. వీరంతా తమ కొత్త తమ్ముడిని చూడాలనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. అందుకే వారిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను అని పోలీసులకు వివరించాడు. ఇది విన్న పోలీసు సిబ్బంది పగలబడి నవ్వుకున్నారు. అయితే, ప్రమాదకర రీతిలో చిన్నారులను బైక్​పై అలా తీసుకెళ్లడం సరికాదని అతడిని పోలీసులు మందలించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించినందుకు చలానా జారీ చేశారు.


Tags:    

Similar News