NEET UG 2023 Results: ‘నీట్‌’ ఫలితాలు విడుదల.. తెలుగు విద్యార్థికి టాప్ ర్యాంక్

అబ్బాయిలదే హవా

Update: 2023-06-14 01:08 GMT




విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం రాత్రి రిలీజ్ చేసింది. మొత్తం 20,38,596 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. 11,45,976 మంది అర్హత సాధించినట్లు ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ 720కి 720 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. EWS కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్‌ ప్రవధాన్‌ రెడ్డి రెండో ర్యాంకు సాధించగా.. SC కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది.తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. NEETకు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు NTA తెలిపింది.

మే 7న నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం 11,45,976మంది NEETకు అర్హత సాధించగా.. వారిలో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులు ఉన్నారు.

ఈసారి నీట్‌ ఫలితాల్లో అబ్బాయిలే హవా చాటారు. టాప్‌ 50 అభ్యర్థుల్లో 40మంది అబ్బాయిలే ఉండగా.. 10మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల్లో పంజాబ్‌కు చెందిన ప్రంజల్‌ అగర్వాల్‌ (4వ ర్యాంకు), అషికా అగర్వాల్‌ (11వ ర్యాంకు) 715 మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఇక ఫలితాలు తదితర వివరాల కోసం అభ్యర్థులు https://neet.nta.nic.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.




Tags:    

Similar News