TSPSC Group-2: గ్రూప్-2 పరీక్ష వాయిదా పడుతుందా?

Update: 2023-08-11 02:03 GMT

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. నిన్న(గురువారం)తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్ నుంచి పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చిన వేలాది మంది అభ్యర్థులు.. టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించారు. పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సైతం భారీగా మోహరించినప్పటికీ భారీగా అభ్యర్థులు రావడంతో అడ్డుకోలేకపోయారు.




 


పరీక్షలను వాయిదా వేయాలని దాదాపు 150 మంది అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గురుకుల టీచర్‌, పాలిటెక్నిక్‌, జేఎల్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత గ్రూప్‌-2 నిర్వహించాలని తాము చేసిన విజ్ఞప్తులను టీఎ్‌సపీఎస్సీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రతి పరీక్షకు మధ్య మూడునెలల గ్యాప్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని టీఎస్పీఎస్సీ గతంలో హామీ ఇచ్చిందని.. దానిని పట్టించుకోకుండా ఈనెల 29, 30 తేదీల్లో పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని వారి తరఫు న్యాయవాది బి. నర్సింగ్‌ తెలిపారు.

అయితే.. ఈలోపే అభ్యర్థులు వేలాదిగా తరలివచ్చి ఆందోళన చేయడంతో ఈ విషయం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న సుమారు 70 మందిపై బేగంబజార్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మూకుమ్మడిగా ఒకేసారి వందలాదిగా తరలివచ్చి ముట్టడికి కారకులైన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తున్నది.ఈ ముట్టడికి సూత్రధారి అయిన కోచింగ్‌ సెంటర్‌ యజమాని అశోక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. నిందితులందరికీ నోటీసులు పంపినట్టు తెలిసింది. మరో వైపు మరో మూడు నెలలు పరీక్ష వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.




Tags:    

Similar News