ఓ దళితుడు.. టిప్టాప్గా తయారైండని.. ఇష్టమొచ్చినట్టు కొట్టిన్రు

Update: 2023-06-01 14:17 GMT

దేశం ఇంత అభివృద్ధి చెందినా.. చదువు పట్ల అవగాహన వచ్చినా.. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కుల వ్యవస్థ మాత్రం పోవట్లేదు. అగ్ర కులం, దళిత కులం అంటూ మనుషుల మద్య వ్యత్యాసం చూపుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. దళిత వ్యక్తి మంచి బట్టలు, కూలింగ్ గ్లాస్ లు పెట్టుకున్నందుకు.. ఆ ఊళ్లోని అగ్ర కులస్తులు దారుణంగా కొట్టారు.

కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుండని

గుజరాత్ లోని బనస్కాంత జిల్లా మోటా గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ గ్రామానికి చెందిన జిగర్ షెఖాలియా అనే దళిత వ్యక్తి.. కొత్త బట్టలు వేసుకుని, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని తన ఇంటి ముందు నిల్చున్నాడు. అటుగా వెళ్తున్న ఓ అగ్రవర్ణానికి చెంది వ్యక్తి.. జిగర్ ను చూసి ఓర్వలేకపోయాడు. జిగర్ దగ్గరికి వెళ్లి ‘బాగా ఎదుగుతున్నావ్. కానీ, నీ స్థాయిలో నువ్వు ఉండు. కాదని ఎక్కువ చేస్తే చంపేస్తాన’ని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈడ్చుకెళ్లి దాడి

తర్వాత మంగళవారం రాత్రి గుడి దగ్గరున్న జిగర్‌ ను.. అటుగా వెళ్తున్న ఏడుగురు అగ్ర కులస్తులు కలిశారు. ఊళ్లో బాగా రెడీ అవ్వడం గురించి ప్రశ్నించారు. తర్వాత వాళ్లతో తెచ్చుకున్న చేతి కర్రలతో జిగర్ పై దాడి చేశారు. పక్కనే ఉన్న డైరీ పార్లర్ వెనుకకు ఈడ్చుకెళ్లి చితబాదారు. దీన్ని గమనించిన జిగర్‌ తల్లి.. పరుగున అక్కడకు వచ్చింది. తన కొడుకును కొట్టొద్దని బ్రతిమిలాడింది. తమను తాకిందన్న కోపంతో.. జిగర్ తో పాటు ఆమెను కూడా కొట్టారు. ఆమె దుస్తులను చించి.. స్థాయిని మించి బతికితే చంపుతామని బెదిరించారు.

కేసు నమోదు

ఈ సంఘటనపై జిగర్, అతని తల్లి కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రాజపుత్‌ వర్గానికి చెందిన ఏడుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు.. పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పినా.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.

Tags:    

Similar News